కన్ఫ్యూజన్లో పెట్టేసిన జక్కన్న

రాజమౌళి నుంచి ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతోందంటూ మూడు రోజుల కిందట వార్తలు వచ్చేసరికి అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఉత్కంఠకు తెరదించుతూ ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరుతో తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు జక్కన్న. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడు కాగా.. ఆయన తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించనున్నాడు.

నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇండియా సినిమాలో ఇప్పటిదాకా ఎన్నో బయోపిక్స్ చూశామని.. కానీ ఇది ఇండియన్ సినిమా బయోపిక్ అని చిత్ర బృందం ప్రకటించింది. ఐతే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రేక్షకుల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అసలు ఇండియన్ సినిమాకు బయోపిక్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలిది ఫీచర్ ఫిలిమేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఇండియన్ సినిమా పుట్టు పూర్వోత్తరాలు.. దాని ఎదుగుదల.. వేర్వేరు కాలాల్లో సినిమాల మేకింగ్, కథల పరంగా వచ్చిన మార్పులు చేర్పులు.. ఇలాంటి విషయాలను చర్చించే డాక్యుమెంటరీ టైప్ మూవీ అయి ఉంటుందని దీనిపై ఒక అంచనా కలుగుతోంది. ఇలాంటి ఫిలిమ్స్‌ను చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి.. ప్రముఖులకు చూపించడానికి బాగానే ఉంటుంది.

కానీ.. సామాన్య ప్రేక్షకులకైతే ఇలా మన సినిమా చరిత్ర తెలుసుకోవాలని.. వెండితెరపై ఆ విశేషాలు చూడాలని అంత ఆసక్తి ఉండదు. రాజమౌళి సమర్పకుడు అయినా సరే.. వాటి మీద ఆసక్తి కలుగుతుందా అన్నది సందేహమే. అసలిది డాక్యుమెంటరీ టైప్ మూవీనా.. లేక రెగ్యులర్ ఫీచర్ ఫిలిం స్టయిల్లోనే ఇండియన్ సినిమా బయోపిక్‌ను కొత్త తరహాలో ప్రెజెంట్ చేస్తారా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి బృందం ఆ క్లారిటీ ఇచ్చాకే ప్రేక్షకులకు దీనిపై ఎలాంటి ఆసక్తి ఉందో తెలుస్తుంది.