షేకవుతుందనుకున్న వీకెండ్ మూగబోయేలా ఉందే

సెప్టెంబరు 28.. ఈ ఏడాదికి క్రేజీయెస్ట్ రిలీజ్ డేట్‌ అని అనుకున్నారు అంతా. ఈ వీకెండ్లో ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం అని అంచనా వేశారు. విదేశాల్లో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయగల అవకాశమున్న వీకెండ్‌గా దీని మీద అంచనాలు కలిగాయి. ఎందుకంటే ఆ రోజే ప్రభాస్-ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’ మూవీ రిలీజ్ కావాల్సింది. ఏడాది కిందటే ఈ డేట్ ప్రకటించి.. రెండు వారాల ముందు వరకు కూడా ఆ డేట్‌కే కట్టుబడి ఉంది టీం.

యుఎస్‌లో ప్రిమియర్ షోల టికెట్ల అమ్మకాలు కూడా జోరుగా జరగడంతో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం అంతా కాదు. కానీ ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ సినిమాను వాయిదా వేసేసింది చిత్ర బృందం. దీంతో హడావుడిగా కొన్ని సినిమాలు సెప్టెంబరు 28కి డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. వాటిలో తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. 

‘రూల్స్ రంజన్’, ‘మ్యాడ్’ చిత్రాలు వాాయిదా పడగా.. చివరికి ‘స్కంద’, ‘చంద్రముఖి-2’, ‘పెదకాపు’ సినిమాలు సెప్టెంబరు చివరి వీకెండ్‌కు ఫిక్సయ్యాయి. ఐతే ఈ సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయో అన్న సందేహాలు కలుగుతున్నాయి. వీటిలో దేనికీ ఆశించినంత బజ్ కనిపించడం లేదు. ‘స్కంద’ ట్రైలర్ చూస్తే మరీ రొడ్డుకొట్టుడులా అనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. క్రమ క్రమంగా బజ్ తగ్గుతూ వస్తోంది.

మరోవైపు ‘చంద్రముఖి’ ట్రైలర్ చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ సినిమా ఒక ట్రోల్ మెటీరియల్ అవుతుందనే టాక్ నడుస్తోంది. సినిమాకు ఏమాత్రం బజ్ క్రియేట్ కావట్లేదు. ఇక ‘పెదకాపు’ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించినా.. కొత్త హీరో కావడంతో దీనికి హైప్ రావట్లేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రావడం కష్టమే. టాక్ బాగుంటే పుంజుకోవచ్చు. మొత్తంగా చూస్తే ‘సలార్’ మూవీతో మోత మోగవుతుందనుకున్న వీకెండ్.. దాని స్థానంలో రాబోయే వేరే సినిమాలతో మూగబోతుందనే అన్న డౌట్లు కొడుతున్నాయి.