‘సైమా’ అవార్డులపై ట్రోలింగ్

తెలుగులో ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు మరుగున పడిపోయాక.. ప్రైవేటు అవార్డులకు ప్రాధాన్యం పెరిగింది. ఫిలిం ఫేర్, సైమా లాంటి అవార్డులకు సినిమా వాళ్లు ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా వాటిని  కొంచెం ప్రత్యేేకంగానే చూస్తున్నారు. ఐతే ఈ ప్రైవేేటు అవార్డుల్లో కొన్ని అవార్డులు చూసి ఆశ్చర్యం కలగడం మామూలే. పాపులారిటీ.. పలుకుబడి లాంటివి చూసి మెహర్బానీ కోసం కొన్ని అవార్డులు ఇస్తుంటారు.

ఈసారి కూడా కొన్ని అవార్డులు అలాగే అనిపిస్తున్నాయి. వాటిని చూసి సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? ఎప్పట్లాగే ట్రోలింగ్ చేస్తున్నారు. సైమా అవార్డుల్లో అత్యంత ఆశ్చర్యం కలిగించిన అవార్డు శ్రీలీల ఉత్తమ నటిగా ఎంపిక కావడం. ‘ధమాకా’ సినిమాకు గాను ఈ అమ్మాయి అవార్డు దక్కించుకుంది. ఐతే ‘ధమాకా’ సినిమాలో ఆమె బాగా నటించింది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కనిపించదు.

అదొక రొటీన్ మాస్ సినిమా. అందులో శ్రీలీల పాత్ర కూడా సాధారణంగా ఉంటుంది. తన అందం, డ్యాన్స్‌లు సినిమాకు ప్లస్ అయిన మాట వాస్తవం. కానీ పెర్ఫామెన్స్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్టులతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి గట్టి పోటీదారు అయిపోయింది శ్రీలీల. ఈ పాపులారిటీ చూసే ఆమెకు అవార్డిచ్చినట్లున్నారు. మరోవైపు ‘స్వాతిముత్యం’తో హీరోగాా పరిచయం అయిన బెల్లంకొండ గణేష్ ‘ప్రామిసింగ్ డెబ్యుూ హీరో’గా ఎంపికయ్యాడు.

ఐతే మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘స్వాతిముత్యం’ సరిగా ఆడకపోవడానికి గణేష్ కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర అతడి నటన వల్ల తేలిపోయింది. రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’లోనూ గణేష్ నటుడిగా మెప్పించలేకపోయాడు. మరోవైపు ‘హీరో’ చిత్రంతో అరంగేట్రం చేసిన అశోక్ గల్లాకు ‘బెస్ట్ డెబ్యూ హీరో’గా అవార్డు దక్కింది. అందులో తన పెర్ఫామమెన్స్ మీదా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ అవార్డుల విషయంలోనూ కౌంటర్లు పడుతున్నాయి.