రూపాయి తీసుకోకుండా నటించిన దీపికా

పది రోజులు దాటాక ముందే ఏడు వందల కోట్లకు దగ్గరగా వెళ్తున్న షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఇప్పుడు కాస్త నెమ్మదించినా మళ్ళీ ఈ వీకెండ్ సత్తా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో దీపికా పదుకునే ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఎమోషన్ టచ్ ఎక్కువగా ఉండే ఆ క్యారెక్టర్ కి దర్శకుడు అట్లీ ఇచ్చిన ఫినిషింగ్ చాలా టచింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను దీపికా పదుకునేకు రెగ్యులర్ ఇచ్చే భారీ పారితోషికమే ముట్టజెప్పారనే వార్త ముంబై మీడియా వర్గాల్లో గట్టిగా తిరిగింది.

అయితే అవన్నీ నిరాధారమంటూ దీపికా కొట్టిపారేసింది. జవాన్ కోసం తాను ఒక్క రూపాయి తీసుకోకుండా చేశానని, ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటం వల్ల ఇంకేమి ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. తీసింది షారుఖ్ ఖాన్ స్వంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్. కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ఓం శాంతి ఓం నుంచి దీపికాతో షారుఖ్ కి మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఆ కారణంగానే ఫ్రీగా చేసి ఉండొచ్చు. డబ్బు రూపంలో తీసుకోకపోయినా ఏదో ఒక రూపేణా కింగ్ ఖాన్ ఇవ్వకుండా అయితే ఉండడు. అందులోనూ ఇంత భారీ బ్లాక్ల్ బస్టర్ అయ్యాక పోనిలే అని వదిలే సమస్యే లేదు.

ఇది దీపికా పదుకునే ఔదార్యమంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీని సంగతి సరేకాని ప్రభాస్ తో చేస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్  కె గురించి అడిగితే మాత్రం అమ్మడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతానని, ఇప్పుడు ఏవేవో చెప్పేసి అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్ మెంట్ తగ్గించలేనని కుండ బద్దలు కొట్టింది. టాలీవుడ్ ఎంట్రీ పట్ల మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. జవాన్ లాగే గతంలో 83, సర్కస్ లో ఇష్టపడి నటించిన దీపికా వాటికీ డబ్బులు తీసుకోలేదు. అవి భర్త రణ్వీర్ సింగ్ నటించినవి. కానీ షారుఖ్ కోసం చేయడమంటే విశేషమేగా.