‘డెవిల్’ నుండి డైరెక్టర్ అవుట్? 

నందమూరి కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డెవిల్’. సుభాష్ చంద్ర బోస్ కథతో సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో పీరియాడిక్ గా  తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా దర్శకుడు అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు పుష్ప రైటర్ శ్రీకాంత్ విస్సా కథను అందించగా నవీన్ చేతిలో ప్రాజెక్ట్ పెట్టారు నిర్మాత అభిషేక్ నామ. దర్శకుడు నవీన్ కి విజువల్ ఎఫెక్ట్స్ లో మంచి అనుభవం ఉంది. ‘అవతార్’ వంటి హాలివుడ్ టాప్ సినిమాలకు వర్క్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ కి అతనే రైట్ ఛాయిస్ అని హీరో , నిర్మాత భావించారు. చకచకా షూటింగ్ జరుపుకుంది. 

 తన మీద పెట్టుకున్న నమ్మకంతో నవీన్ ఇప్పటి వరకూ బెస్ట్ వర్క్ ఇచ్చాడట. నవీన్ ఈ సినిమాతో పెద్ద దర్శకుడు అవుతాడని టీం బయట గట్టిగా చెప్పుకున్నారు. కానీ లోలోపల ఏమైందో తెలియదు కానీ ఉన్నపళంగా నిర్మాత అభిషేక్ నామా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి దర్శకుడిని తప్పించారని తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా నిర్మాతే దగ్గరుండి చూసుకుంటున్నారట.  

అందుకే రీసెంట్ గా విడుదల చేసిన హీరోయిన్ పోస్టర్ మీద కూడా దర్శకుడి పేరు తొలగించి ఆ ప్లేస్ లో అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్ అంటూ నిర్మాణ సంస్థ పేరు పెట్టారని తెలుస్తుంది. ఏదేమైనా ప్రతీ సినిమాకు నిర్మాత -దర్శకుడికి ఏవో క్రియేటివ్ డిఫరెన్స్ లు , బడ్జెట్ ఇష్యూలు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యే క్రమంలో రిలీజ్ కి దగ్గర ఉండగా ఇలా దర్శకుడిని నిర్మాత ఎందుకు దూరం పెట్టినట్టు ? ఈ ఇద్దరి వివాదంలో హీరో కళ్యాణ్ రామ్ కలుగ జేసుకోలేకపోయారా ? అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.