సలార్ మీనమేషాలు లెక్కబెట్టింది ఇందుకేనా

తోటి నిర్మాతలకు అసహనాన్ని, అభిమానులకు ఆగ్రహాన్ని ఒకే టైంలో ఇస్తున్న సలార్ నిర్మాతలు ఎట్టకేలకు ఒక పెద్ద టెన్షన్ తీర్చుకున్నట్టు బెంగళూరు టాక్. థియేట్రికల్ రన్ తర్వాత జరగాల్సిన ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మేయడంతో చాలా రిలాక్స్ గా ఫీలవుతున్నారట. ఎందుకంటే డిజిటల్ నుంచి హోంబాలే ఫిలింస్ చాలా భారీ మొత్తాన్ని ఆశిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఈ సంస్థ సినిమాలన్నీ టోకున కొంటూ వచ్చిన అమెజాన్ ప్రైమ్ సలార్ చెప్పిన రేట్ కి వెనుకడుగు వేసి నెలల తరబడి బేరాలు ఆడిందని అంతర్గత వర్గాల టాక్.

దీంతో ఎంతకీ ఒప్పందం కుదరకపోవడంతో పోటీదారులను ఆహ్వానించాల్సి వచ్చిందని, అందుకే నెట్ ఫ్లిక్స్ సలార్ ని ఎగరేసుకుపోయిందనే వెర్షన్ వినిపిస్తోంది. పైగా ప్రభాస్ సినిమాలు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లు వరసగా ప్రైమ్ కు ఆశించిన భారీ ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అందుకే ధర విషయంలో వెనుకా ముందు ఆడారట. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న నెట్ ఫ్లిక్స్ 150 నుంచి 200 కోట్ల మధ్య డీల్ చేసుకుందని అంటున్నారు. అఫీషియల్ ఫిగర్ బయటికి వచ్చే ఛాన్స్ ఇప్పట్లో లేదు కానీ కళ్ళు చెదిరే ఆఫర్ అయితే ఇచ్చారని తెలిసింది.

ఇప్పుడు థియేట్రికల్ హక్కులను అమ్మడం మిగిలింది. అయితే డేట్ పక్కాగా చెబితే తప్ప బయ్యర్లు ఎలాంటి నిర్ణయానికి రాలేరు. నవంబరా డిసెంబరా అనే మీమాంస ఇంకా తీరలేదు. బయట జరుగుతున్న ప్రచారాలు, ఇతర ప్రొడ్యూసర్లు పడుతున్న అగచాట్లతో తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న హోంబాలే పెద్దలు కనీసం ట్రైలర్ ఎప్పుడు వస్తుందనేది కూడా చెప్పడం లేదు. ప్రభాస్ తనవరకు బాధ్యతలు పూర్తి చేసి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో వచ్చేలోపు పూర్తి చేయాల్సిన పనులన్నీ ప్రశాంత్ నీల్ మీదే ఉన్నాయి. కొత్త డేట్ ఎప్పటికి వచ్చేనో.