ఆ యాక్టర్ రాలేదు.. అందుకే నటించా

కొందరు దర్శకులు నటులుగా మారి సినిమాలు చేశారు. తెలుగులో విశ్వనాథ్ గారు, దాసరి గారు నటులుగా కూడా రాణించారు. కాశీ విశ్వనాథ్ వంటి వాళ్ళు కూడా నటులుగా సెటిలయ్యారు. తరుణ్ భాస్కర్ , దేవి ప్రసాద్, వీర శంకర్ వంటి చిన్న దర్శకులు కూడా యాక్టర్స్ గా మారి బిజీ అయ్యారు. ఇక దర్శకుడు సముద్రఖని కూడా నటుడిగా తమిళ్ , తెలుగు రెండు భాషల్లో ఫుల్ బిజీ అయ్యాడు.

ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే మరో దర్శకుడు నటుడిగా మారాడు. ‘కొత్త బంగారు లోకం’తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల తాజాగా ‘పెదకాపు 1’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఓ విలన్ కేరెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో శ్రీకాంత్ అడ్డాల సీన్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు.  

అణచివేతకి ఎదురుతిరిగిన కుర్రాడి కథతో విలేజ్ యాక్షన్ మూవీగా  ‘పెదాకాపు 1’ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఆ పాత్ర కోసం తను ఎందుకు నటుడిగా మారాడో ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఆ పాత్రకు ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్ ను ఫైనల్ చేసుకున్నారట. తను ఆ రోల్ కి ఒకే చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి కట్ చేస్తే తను ఏమైందో షూటింగ్ రాలేదని, దాంతో మిగతా బిజీ ఆర్టిస్టుల డేట్స్ కోసం అప్పుడు తన అసోసియేట్ కిషోర్ తననే ఆ కేరెక్టర్ చేయమని అప్పటికప్పుడు ఒప్పించడాని చెప్పుకున్నాడు శ్రీకాంత్.

అలా అనుకోకుండా నటుడిగా మారాను తప్ప, తనకి నటనపై ఆసక్తి లేదని తెలిపాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తను చేసిన అప్పీరియన్స్ లు ఆ టైమ్ లో ఆ ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే తప్ప అందులో తన ప్రమేయం లేదని చెప్పాడు అడ్డాల. ఏదేమైనా శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే ఇటు దర్శకుడిగా అటు నటుడిగా సముద్రఖని తరహాలో బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడేమో మరి.