రెహమాన్ అభిమానులను బాధ పెట్టారు

హీరోలకే కాదు సంగీత దర్శకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కొత్త కాదు. ప్రత్యక్షంగా వాళ్ళను చూస్తూ పాటలు వినే అవకాశం దాన్ని ఎవరూ వదులుకోరు. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని స్వంతం చేసుకోవాలనుకుంటారు. కానీ నిర్వాహకులు ఘనకార్యాల వల్ల కొన్నిసార్లు ఇవి శృతి తప్పి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నిన్న చెన్నైలో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఒకటి ‘మరుక్కుమ నెంజమ్’ పేరుతో ఏర్పాటు చేశారు. ప్రమోషన్లు భారీగా జరగడంతో టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.

ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉన్నా సరే దాన్ని లెక్క చేయకుండా ప్రోగ్రాంకు వచ్చిన వందలాది ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపడేలా చేశారు. వేల రూపాయలు పోసి టికెట్లు కొన్నవాళ్లకు సీట్లు లేకపోవడంతో ఉసూరుమని వెనక్కు తిరగడం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పోనీ లోపల ఉన్న వాళ్ళకైనా ఏమైనా సంతోషం మిగిలిందా అంటే అదీ లేదు. సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, వెనక కూర్చున్న వాళ్లకు వినిపించకపోవడం లాంటి లోపాల వల్ల కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ కోపాన్ని పబ్లిక్ గానే ప్రదర్శించారు

ఇది చెన్నైలోని పనియుర్ ప్రాంతంలో ఉన్న ఆదిత్యరామ్ పాలస్ లో నిర్వహించారు. సుమారు 50 వేలకు పైగా హాజరైతే వాళ్లకు సరిపడా వసతులు సమకూర్చడంలో వేడుక ఆర్గనైయిజర్స్ ఏవిటిసి ఈవెంట్స్ ఘోరంగా ఫెయిలవ్వడంతో రద్దీని అదుపు చేయలేక ఒకదశలో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. ఇంతకన్నా పెద్ద స్థాయిలో ఓపెన్ స్టేడియంలో ఇళయరాజా, రెహమాన్, ఎస్పిబిలు లైవ్ ఇచ్చినప్పుడు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు నిర్వాహకుల దగ్గర సమాధానం లేదు. దీనికి స్కామ్ 2023 అని పేరు పెట్టి ట్విట్టర్ లో ట్రెండింగ్ కూడా చేయడం గమనార్హం.