ఈ నటుడిది చిన్న నేపథ్యం కాదు

ఇవాళ ఉదయం ఒక టీవీ సిరీస్ కోసం డబ్బింగ్ చెబుతుండగా చెన్నైలో హఠాత్తుగా కన్ను మూసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరిముత్తు ఇటీవలే జైలర్ లో కనిపించిన సంగతి తెలిసిందే. విలన్ వర్మ పక్కన నమ్మకస్తుడిగా చివరికి అతని చేతిలోనే చనిపోయే పాత్రలో చాలా కూల్ గా కనిపించారు. రెగ్యులర్ గా తమిళ డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్లకు ఈయన బాగా సుపరిచితం. అయితే మరిముత్తు కేవలం యాక్టర్ మాత్రమే కాదన్న విషయం అందరికీ తెలియదు. ఎంత బహుముఖప్రజ్ఞ ఉన్నప్పటికీ నటుడిగానే ఎక్కువ గుర్తింపు రావడంతో మిగిలిన సంగతులు మరుగున పడ్డాయి.

మరిముత్తు ఇండస్ట్రీకి దర్శకుడు కావాలనే లక్ష్యంతో వచ్చారు. 1990లో ఇంట్లో చెప్పాపెట్టకుండా మదరాసు వచ్చేసి గీత రచయిత వైరముత్తు దగ్గర సహాయకుడిగా ఉన్నారు. రచనలో ఇతని ఆసక్తి చూసి ఆయన ప్రోత్సహించేవారు. తర్వాత మణిరత్నం. ఎస్జె సూర్య లాంటి టాప్ డైరెక్టర్స్ తో పని చేసే అవకాశం దక్కింది. శింబు మన్మధకు పని చేసినప్పుడు పరిచయాలు పెరిగాయి. స్వంతంగా డైరెక్ట్ చేసే ఛాన్స్ కన్నుమ్ కన్నుమ్ తో దక్కింది. తర్వాత పులివాల్ తీశారు. ఈ రెండు పెద్దగా ఆడకపోవడంతో క్రమంగా నటన, టీవీ షోలు ఈ రెండే ప్రపంచంగా మార్చుకున్నారు.

డైరెక్షన్ పరంగా ఆయన సక్సెస్ కాలేకపోయినా ఎందరో దర్శకులకు సలహాలు సూచనలు ఇచ్చి వాటి విజయంలో కీలక పాత్ర పోషించేవారు. టీవీ సీరియల్ ఎతిర్ నీచల్ మరిముత్తుకి చాలా పేరు తీసుకొచ్చింది. దాని వల్ల  ఏకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం టెలివిజన్ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకుంటాయి. ఈయన వయసు 58 సంవత్సరాలు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో సమీప ఆసుపత్రికి తరలించే లోపే కన్ను మూయడం విషాదం. జైలర్ లో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయారు. మరిముత్తు చివరి సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2 వచ్చే ఏడాది విడుదల కానుంది.