బాలు కోసం విదేశీ వైద్య బృందం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల కిందట ఆయన కాస్త కోలుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు.

వెంటిలేటర్ మీదే కొనసాగుతూ.. పరిస్థితి పెద్దగా మెరుగుపడకపోవడంతో ఆయనకు ఏమవుతుందో అన్న కంగారు అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి అప్ డేట్ ఇస్తూ ఎస్పీ చరణ్ చాలా ఎమోషనల్ అవడం చూసి బాలు అభిమానుల కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.

బాలును రక్షించేందుకు ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. 12 మంది వైద్యుల బృందం ఆయనకు సేవలందిస్తోంది. ఆయన్ని కామన్ ఐసీయూ నుంచి తీసుకెళ్లిపోయి.. ఒక ఫ్లోర్లో ప్రత్యేకంగా ఐసీయూను ఏర్పాటు చేశారు. క్షణక్షణం ఆయన్ని వైద్యులు కనిపెట్టుకుని ఉంటూ సేవలందిస్తున్నారు.

అయినా పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విదేశాల నుంచి వైద్య బృందాన్ని రప్పిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆ బృందం ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుంటుందట. వాళ్లయినా బాలు పరిస్థితిని మెరుగుపరిచి కోట్లాది మంది ఆయన అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా.. బాలు వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుండటం విశేషం. విదేశీ వైద్యుల్ని రప్పించే విషయంలో కూడా ప్రభుత్వమే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలు తెలుగువాడైనప్పటికీ.. తమిళంలో వేల పాటలు పాడి అక్కడి సంగీత ప్రియులకు అపరిమిత ఆనందాన్నిచ్చిన ఆయన్ని పరాయివాడిగా చూడట్లేదు అక్కడి జనం, ప్రభుత్వం. బాలు పరిస్థితి విషమించినప్పటి నుంచి తమిళ సినీ జనాలతో పాటు సామాన్యులు సైతం తీవ్ర వేదనకు గురవుతున్నారు.