హిరణ్యకశ్యప అప్‌డేట్ ఇచ్చిన రానా

టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా ‘హిరణ్య కశ్యప’. ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రం తీసి మెప్పించిన గుణశేఖర్.. అందులో ముఖ్య పాత్ర చేసిన రానా దగ్గుబాటిని లీడ్ రోల్‌లో పెట్టి ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి కొన్నేళ్ల పాటు కసరత్తు కూడా చేశాడు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆ సినిమాకు బ్రేక్ పడింది. గుణశేఖర్ ‘శాకుంతలం’ మొదలుపెట్టి పూర్తి చేశాడు.

దీని తర్వాత ఆయన ‘హిరణ్య కశ్యప’ తీస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని పరిణామాల మధ్య గుణశేఖర్ లేకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సురేష్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది. ఈ మధ్య యుఎస్‌లో జరిగిన కామిక్ కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో రానా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు కూడా. దానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తాడని కూడా రానా ప్రకటించాడు.

ఐతే శ్రీకారం చుట్టిన ప్రాజెక్టు నుంచి తననే తప్పించడం పట్ల గుణశేఖర్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. తనకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ ముందుకు కదులుతుందా లేదా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.  కానీ రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘హిరణ్య కశ్యప’ గురించి అప్‌డేట్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది మార్చిలో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తామని స్పష్టం చేశాడు. ఈ సినిమాకు దర్శకుడెవరనే సస్పెన్సుకి ఇంకా తెరదించని రానా.. త్రివిక్రమ్ రచనా బాధ్యతలు చూస్తున్నట్లు మాత్రం మరోసారి ధ్రువీకరించాడు. 1967లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ ఎంతోమంది ప్ేక్షకులను ఆకట్టుకుందని.. దాని మోడర్న్ వెర్షన్‌ను ఎంతో రిచ్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో కొత్త తరానికి అందించాలన్నదే తమ ప్రయత్నం అని రానా తెలిపాడు.