మన్మథుడు అదొక్కటే లోపం

నిన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ జరుపుకున్న మన్మథుడుకి థియేటర్లలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా అభిమానులు, యూత్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్టు వీడియోలు చూస్తేనే అర్థమైపోతోంది. లవంగంగా బ్రహ్మానందం ఎంట్రీకి సైతం విజిల్స్ వేసి పేపర్లు విసిరారంటే ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ స్వంత యూట్యూబ్ ఛానల్ లోనే అందుబాటులో ఉన్న ఈ క్లాసిక్ ని అదే పనిగా టికెట్లు కొని చూసేందుకు వచ్చారంటే ఈ సినిమాకున్న క్రేజ్ గురించి అంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏముంటుంది.

అయితే చంద్రుడికో మచ్చలా అంతా బాగానే ఉంది కానీ మన్మథుడు 4కె రీ మాస్టరింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్న మాట వాస్తవం. చాలా సన్నివేశాల్లో బ్లర్ స్పష్టంగా కనిపించింది. డాల్బీ సౌండ్ విషయంలో ఎలాంటి కంప్లయింట్ లేదు కానీ విజువల్ గా కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్టు అన్ని చోట్ల నుంచి ఒకే తరహా ఫీడ్ బ్యాక్ వచ్చింది. నరసింహనాయుడు, తొలిప్రేమ, ఆరంజ్ లాంటి సినిమాలను బెస్ట్ ఎక్స్ పీరియన్స్ తో ఎంజాయ్ చేసిన ఆడియన్స్ కి మన్మథుడు బ్లర్ కొంత చికాకు పెట్టేసింది. త్రివిక్రమ్ మాటలు, అదిరిపోయే దేవిశ్రీ ప్రసాద్ పాటల ముందు ఇది మరీ ఎక్కువ హైలైట్ కాలేకపోయింది.

కాకపోతే ఇకపై ఒరిజినల్ నెగటివ్ ని ప్రాసెస్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ శివ, ప్రేమాభిషేకం ఉన్నాయంటున్నారు. అవి చాలా పాత సినిమాలు. ఎప్పుడో వచ్చినవి కాబట్టి టికెట్లు కొన్నాక అసంతృప్తి అనిపిస్తే ప్రేక్షకులు క్షమించేయరు. బెస్ట్ కోరుకుంటారు. బాలీవుడ్ లో ఈ మధ్య ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం వచ్చిన క్లాసిక్స్ ని సైతం మతిపోయే క్వాలిటీతో స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాంటిది మన్మథుడు మరీ అంత జమానాది కానప్పుడు ఇంకాస్త శ్రద్ధ వహించాలి. ఇప్పుడు జనాల దృష్టి సెప్టెంబర్ 22న రాబోయే 7జి బృందావన్ కాలనీ మీద ఉంది.