మొహమాటం లేకుండా చిరంజీవి ‘నో’  

రీమేకుల మేకులు మెగాస్టార్ కి గట్టిగానే గుచ్చుకున్నాయి. ముఖ్యంగా తన కెరీర్ లోనే దారుణమైన ఓపెనింగ్స్ చూసే పరిస్థితి వస్తుందని భోళా శంకర్ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పించేసింది. దెబ్బకు ఇకపై ఇతర బాషల హక్కులతో ఎవరైనా వస్తే నిర్మొహమాటంగా నో చెప్పాలని డిసైడ్ అయ్యారట. వేదాళం ఏ ఓటిటిలో లేదంటే గుడ్డిగా నమ్మేసి, ఎవరూ చూసి ఉండరనే ధీమాతో షూటింగుకు వెళ్లిపోవడం నిర్మాతను బయ్యర్లను నిలువునా ముంచేయడంతో ఇకపై ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దానికి తాజా ఉదంతమే ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇటీవలే ఒక అగ్ర నిర్మాత చిరుని కలిశారట. గత ఏడాది కేరళ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన మమ్ముట్టి భీష్మ పర్వం హక్కులు తన దగ్గర ఉన్నాయని, ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా ఆడుతుందని ఒక అప్ కమింగ్ డైరెక్టర్ తో డమ్మీ నెరేషన్ ఇప్పించే ప్రయత్నం చేశారట. అయితే ఆ సినిమా తెలుగు డబ్బింగ్ తో సహా హాట్ స్టార్లో ఉన్న విషయం తెలియడంతో పదే పదే ఒకే పొరపాటు చేసేందుకు సిద్ధంగా లేనని, గాడ్ ఫాదర్ టైంలో లూసిఫర్ ని ఇదే విధంగా తక్కువంచనా వేసి లెక్క తప్పానని తన వైపు కారణాలు స్పష్టంగా వివరించినట్టు తెలిసింది.

ఇదంతా జరిగిందనడానికి ప్రూఫ్ లేకపోయినా మెగా కాంపౌండ్ నుంచి తిరుగుతున్న టాకే కాబట్టి తేలిగ్గా తీసుకోలేం. ఏది ఏమైనా ఇది బెస్ట్ డెసిషన్ అనే చెప్పాలి. ఓటిటిలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాక రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవిక కోణంలో ఆలోచించకుండా ఏదో మనకు నచ్చిన అంశాలున్నాయని ఒప్పేసుకుంటే తర్వాత తీరని నష్టం జరిగిపోతుంది. ఈ కారణం వల్లే మొన్న పుట్టినరోజుకి ప్రకటించాల్సిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని డైరెక్టర్ పేరు, ఇతరత్రా వివరాలు లేకుండా జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు.