శివోహం చుట్టూ సందేహాల వలయం  

ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అవకాశాలు పడుతున్న వాళ్లలో దర్శకుడు రమేష్ వర్మ ఒకరు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు ఒక్కటే ఈయనకు చెప్పుకోదగ్గ హిట్టు. ఆ తర్వాత రవితేజకు ఖిలాడీ రూపంలో ఎంత పెద్ద షాక్ ఇచ్చారో తెలిసిందే. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే నిర్మాతను ఉద్దేశించి అప్పుడప్పుడు సెట్స్ కి రమ్మని మాస్ మహారాజా చెప్పడం వీడియో రూపంలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు శివోహం అనే మరో పెద్ద ప్రాజెక్టు పట్టారు. తమిళ హీరో సూర్య బంధువు టి జ్ఞానవేల్ రాజా నిర్మాతగా మల్టీ లాంగ్వేజెస్ లో ఇది రూపొందనుంది. ఇవాళే టైటిల్ పోస్టర్ వదిలారు.

చెన్నై టాక్ ప్రకారం ఇది భూల్ భులాయ్యా 2 రీమేకట. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ బాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో హీరో, హీరోయిన్ తో సమానంగా ప్రాధాన్యం కలిగిన పాత్రను టబు పోషించారు. ఆవిడది అందులో డ్యూయల్ రోల్. ఒకటి దెయ్యంగా నెగటివ్, మరొకటి సాత్వికంగా పాజిటివ్ ఉంటుంది. కానీ తమిళ తెలుగు కోసం అడిగినప్పుడు టబు నో చెప్పారట. మరి అంతే ఇంటెన్స్ తో అదే స్థాయిలో మెప్పించడం సీనియర్ నటీమణుల్లో ఆమె కాకుంటే ఒక్క నీలాంబరి అలియాస్ రమ్యకృష్ణ వల్లే సాధ్యమవుతుంది.

అందుకే దర్శక నిర్మాతలు ఆ ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. శివోహం హీరో ఎవరో ఇంకా రివీల్ కాలేదు. వరుణ్ తేజ్ ని ట్రై చేశారు కానీ తను సానుకూలంగా స్పందించలేదట. సాయి తేజ్ హెల్త్ కోసం ఆరు నెలలు రెస్ట్ లో ఉండటంతో అదీ సాధ్యం కాలేదు. ఇంకో మీడియం రేంజ్ హీరోని ఒప్పించారనే టాక్ ఉంది కానీ అగ్రిమెంట్ మీద సంతకం అయ్యాకే అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇంకో న్యూస్ ఏంటంటే టబు పాత్రను మగాడిగా మార్పు చేసి ఆ స్థానంలో విజయ్ సేతుపతితో చేయించే ప్లానింగ్ కూడా ఉందట. అసలింతకీ ఇది భూల్ భులాయ్యా 2కి మరో రూపమో కాదో తెలియాల్సి ఉంది.