బోయపాటి తోడుగా.. రామ్ రచ్చ

టాలీవుడ్లో చాన్నాళ్లుగా మిడ్ రేంజ్ లీగ్‌లో ఉన్న యువ కథానాయకులు ఒక్కొక్కరుగా ఆ లీగ్ నుంచి పైకి ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ఈ వేసవిలో ‘దసరా’ మూవీతో నాని రేంజ్ మారింది. ‘ఖుషి’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే విజయ్ దేవరకొండ సైతం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాడని భావిస్తున్నారు. అతడి వెనుకే మరో యంగ్ హీరో పెద్ద టార్గెట్ మీద దృష్టిపెడుతున్నాడు. అతనే.. రామ్. బోయపాటి శ్రీను లాంటి పెద్ద డైరెక్టర్‌తో జట్టు కట్టడంతో అతడి మార్కెట్ లెక్కలన్నీ మారిపోయాయి.

వీరి కలయికలో రాబోతున్న ‘స్కంద’కు జరుగుతున్న బిజినెస్ చేసి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోతున్నారు. ‘అఖండ’ తర్వాత బోయపాటి నుంచి రానున్న సినిమా కావడం.. ప్రోమోలన్నీ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు ఊహించని స్థాయిలో వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.50 కోట్ల కంటే ఎక్కువే పలికినట్లు సమాచారం.

‘స్కంద’కు ఆంధ్రా ఏరియాలో రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. సీడెడ్ హక్కులు రూ.8 కోట్ల దాకా పలుకుతున్నాయి. నైజాం రైట్స్ రూ.15 కోట్లు చెబుతున్నట్లు సమాచారం. రూ.12 కోట్లకు రేటు తగ్గకపోవచ్చు. ఓవర్సీస్ రైట్స్ కూడా కలుపుకుంటే బిజినెస్ రూ.50 కోట్ల మార్కును టచ్ చేయబోతున్నట్లే. రామ్ రేంజికి ఇది చాలా పెద్ద బిజినెస్సే.

అతడి మీద ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం రిస్క్ అనే అభిప్రాయాలున్నప్పటికీ.. బోయపాటికి సొంతంగా మాస్‌లో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న నేపథ్యంలో ‘స్కంద’ బయ్యర్లను బయట పడేస్తుందనే భావిస్తున్నారు. ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల నటించగా.. తమన్ సంగీతం అందించాడు. ‘ది వారియర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ నుంచి రాబోతున్న సినిమా ఇది.