దసరాకు ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరే

తెలుగు సినిమా ప్రేమికులకు అతి పెద్ద విందును అందించేది సంక్రాంతి సీజనే. ఆ టైంలో రెండు మూడు భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. బావుంటే అన్ని సినిమాలూ బాగా ఆడతాయి కూడా. ఒకేసారి రిలీజైన మూడు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. సంక్రాంతి తర్వాత డిమాండ్ ఉన్న షార్ట్ సీజన్ అంటే దసరానే. సంక్రాంతి అంత పోటీ లేకపోయినా.. అప్పుడు కూడా ఒకే వీకెండ్లో పేరున్న సినిమాలు రెండు మూడు రిలీజవుతుంటాయి.

ఈసారి ఆ పండక్కి మూడు క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. ఆ మూడింటికీ బంపర్ క్రేజ్ ఉంది. దేనికవే భిన్నంగా అనిపిస్తున్నాయి. వాటి వాటి స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ముందుగా దసరాకు రాబోయే సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ గురించి చెప్పుకోవాలి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సక్సెస్‌ల తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా.. పైగా అనిల్ రావిపూడి దర్శకత్వం కావడంతో దీనిపై ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి.

టీజర్ లాంచ్ అయ్యాక అ:చనాలు ఇంకా పెరిగిపోయాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకోబోయే సినిమాగా దీన్ని చెబుతున్నారు ట్రేడ్ పండిట్లు. దీనికి పోటీగా రానున్న మరో తెలుగు చిత్రం ‘టైగర్ నాగేశ్వరరరావు’కు కూడా హైప్ తక్కువగా లేదు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించేలా ఉంది ఈ బయోపిక్.

టీజర్ అంత ప్రామిసింగ్‌గా కనిపించింది. ఇక అనువాద చిత్రం అయినప్పటికీ ‘లియో’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. విజయ్‌కి తెలుగులో క్రమ క్రమంగా మార్కెట్ పెరుగుతుండగా.. లోకేష్ కనకరాజ్‌ సినిమా అంటే మన ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తెలుగు చిత్రాలకు దీటుగా దీనికి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మూడూ ప్రామిసింగ్‌ సిినిమాల్లాగే కనిపిస్తుండటంతో దసరాకు తెలుగు ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అయిపోయేలా ఉన్నారు.