వందేళ్ల థియేటర్ల చరిత్రలో ఇదే మొదటిసారి

ఓటిటి  జమానా వచ్చాక జనం థియేటర్లు వెళ్లడం తగ్గించిన మాట వాస్తవమే కానీ సరైన సినిమా పడాలే కానీ టికెట్లు కొనడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని బేబీ లాంటి చిన్న సినిమా, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియాలు ఋజువు చేస్తూనే వచ్చాయి. దీన్ని మరింత బలపరించేలా ఆగస్ట్ 11 నుంచి 13 మధ్య వందేళ్ల ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటిసారిగా అత్యధిక రెవిన్యూతో పాటు హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్ నమోదయ్యాయి. జైలర్, గదర్ 2, ఓ మై గాడ్ 2, భోళా శంకర్ లతో పాటు ఇతర ప్రాంతీయ బాషల సినిమాలన్నీ కలిసి 390 కోట్లకు పైగా  కేవలం మూడు రోజుల్లో వసూలు చేశాయి.

అమ్మిన టికెట్లు 2 కోట్ల 10 లక్షల పైమాటే. మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అన్నీ కలిపితే ఇంత పెద్ద ఫిగర్ నమోదయ్యింది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా – మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. దేశం మొత్తం మీద ఉన్న వాటిలో 500 బహుళ సముదాయ తెరలతో పాటు మరో 2500 స్క్రీన్లు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నాయి. రిజిస్టర్ చేసుకోని వాటిని కలుపుకుంటే అదింకా చాలా పెద్ద మొత్తం అవుతుందని అంచనా. ఇంత బిజీ వీకెండ్ తామెన్నడు చూడలేదని యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఒక పక్క జనం రాక థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఫంక్షన్ హాళ్లుగా మారిపోతున్న ట్రెండ్ లో ఇంత అనూహ్య మార్పు రావడం విశేషమే. ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే చాలు వందల సినిమాలు అందుబాటులోకి వస్తున్న కాలంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. రేపు ఇండిపెండెన్స్ డేకి మరో వంద కోట్లకు తోడవ్వచ్చని అదే జరిగితే అదింకో రికార్డు అవుతుందని అంటున్నారు. ట్రాజెడీ ఏంటంటే భోళా శంకర్ కనక డిజాస్టర్ కాకుండా బ్లాక్ బస్టర్ అయ్యుంటే పైన చెప్పిన లెక్క సులభంగా అయిదు వందల కోట్లకు దగ్గరగా వెళ్ళేది.