బాలీవుడ్ ‘మాస్’ కరవు తీరింది

కరోనా దెబ్బకు బాలీవుడ్ సినిమాల మార్కెట్ మామూలుగా దెబ్బ తినలేదు. కరోనా కథ ముగిశాక కూడా ఆ ప్రభావం కొనసాగుతూనే వచ్చింది. ఒకప్పుడు అలవోకగా వందల కోట్లు కొల్లగొట్టేసిన హిందీ సినిమాలు.. ఇప్పుడు వంద కోట్ల మార్కు అందుకున్నా మురిసిపోయే పరిస్థితి వచ్చింది. ‘పఠాన్’ లాంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే ఒకప్పటి స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టాయి. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్ల సినిమాలు ఎంత దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయో తెలిసిందే.

డే-1, వీకెండ్ వసూళ్ల విషయంలో బాలీవుడ్ సినిమాల రేంజ్ బాగా పడిపోయింది. రూరల్ మాస్ సెంటర్లలో వసూళ్లు బాగా పడిపోతుండటం బాలీవుడ్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. అదే సమయంలో పుష్ప, కేజీఎఫ్, కాంతార లాంటి సౌత్ సినిమాలు హిందీ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ.. అనూహ్యమైన వసూళ్లు సాధించడం బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేశాయి.

రూరల్ మాస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు బాగా తగ్గిపోవడం బాలీవుడ్‌‌కు ప్రతికూలంగా మారింది. ఆ వర్గం ప్రేక్షకులను బాలీవుడ్ బాగా దూరం చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ బాలీవుడ్‌కు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది హిందీ రూరల్ మాస్‌‌ను ఈ సినిమా ఊపేస్తోంది. 20 ఏళ్ల కిందటి ‘గదర్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్ 2’ మాస్‌లో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది.

మల్టీప్లెక్సుల్లో కూడా సినిమాకు మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ.. ముఖ్యంగా మాస్ సెంటర్లలో, సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. ‘పఠాన్’ను మించి ఈ సినిమాకు ఆ సెంటర్లలో రెస్పాన్స్ కనిపిస్తోంది. తొలి రోజే ఇండియాలో రూ.40 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ‘గదర్-2’.. రెండో రోజు కూడా అంతే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. రెండు రోజులకే ఈ సినిమా ఇండియాలోనే రూ.85 కోట్ల నెట్ కలెక్షన్లు తెచ్చుకుంది. ఇండిపెండెన్స్ డే నాటికి రూ.200 కోట్ల మార్కును అలవోకగా దాటేయబోతోందన్నది స్పష్టం.