ఆరు పదుల హీరోల అరుదైన యుద్ధం

బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. జైలర్ ప్రీమియర్లు ఇవాళ ఉదయం నుంచి మొదలైపోగా భోళా శంకర్ రేపు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. చిరంజీవి వయసు 67 సంవత్సరాలు కాగా రజనీకాంత్ కు 72 ఏళ్ళు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు పరస్పరం తలపడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇద్దరు కలిసి నటించిన సినిమాలున్నాయి. బందిపోటు సింహంలో చిరు విలన్ గా చేస్తే, కాళీలో సమాన ప్రాధాన్యం కలిగిన క్యారెక్టర్లు చేశారు. మాపిళ్ళైలో మెగాస్టార్ అతిధి పాత్ర పోషించగా కాంబోలో ఒక సీన్ ఉంటుంది.

ఒక స్థాయికి వచ్చాక ఈ కలయిక మళ్ళీ సాధ్యం కాలేదు. బయట వేడుకల్లో కలుసుకోవడం తప్ప ఆన్ స్క్రీన్ కాంబినేషన్ రాలేదు. ఇప్పుడూ జరగలేదు కానీ నువ్వా నేనా అనే పోటీ అయితే వచ్చింది. జైలర్ భీభత్సమైన బుకింగ్స్ తో ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. భోళా శంకర్ ప్రమోషన్ల పరంగా ఎంత కష్టపడినా డైరెక్టర్ బ్రాండ్ తో పాటు రీమేక్ అనే అంశం కొంత నెగటివిటీని తీసుకొచ్చింది. ఫలితంగానే ఆన్ లైన్ అమ్మకాలు నెమ్మదిగా సాగినా రేపు ఉదయానికి అన్నీ సర్దుకుంటాయని, మరోసారి బాస్ మాస్ విశ్వరూపం చూడొచ్చని నిర్మాత అనిల్ సుంకర హామీ ఇస్తున్నారు.

వీటి ఫలితాలు పట్ల ట్రేడ్ చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రెండు సక్సెస్ అయితే ఎంతలేదన్నా మూడు వందల కోట్ల దాకా మార్కెట్ రెవిన్యూ కళ్లజూడొచ్చు. జైలర్ కు మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ పెద్ద అడ్వాంటేజ్ గా నిలవగా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా రూపొందిన భోళా శంకర్ బిసి సెంటర్స్ లో ఆడేసుకుంటాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నట్టు వీళ్ళతోనే తలపడుతున్న గదర్ 2 హీరో సన్నీ డియోల్ ఏజ్ 65 కాగా, ఓ మై గాడ్ టూతో వస్తున్న అక్షయ్ కుమార్ సైతం 55 పడిలో ఉన్నోడే. ఇలా సీనియర్ మోస్ట్ స్టార్లంతా ఒకేసారి బరిలో దిగడం ఆసక్తి కలిగించే పరిణామం. చూడాలి ఎవరు విజేతలవుతారో.