రష్మిక చేతికి మరో ప్యాన్ ఇండియా

గీత గోవిందం, ఛలో, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ లో త్వరగా అగ్ర స్థానం వైపు దూసుకుపోయిన రష్మిక మందన్న ఈ మధ్య హిందీ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో సౌత్ అవకాశాలు తగ్గాయి. అయితే గుడ్ బై, మిషన్ మజ్నులు ఆశించిన విజయం సాధించలేదు. డిసెంబర్ లో రాబోయే యానిమల్ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ వెంకీ కుడుముల కాంబోలో రెండోసారి నటిస్తున్న రష్మికకు మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్టు దక్కింది.

చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతిలు నటించబోయే భారీ మల్టీస్టారర్ లో నటించేందుకు రష్మిక ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెన్నై టాక్. వరదల నేపథ్యంలో 2018 తీసి కేరళ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్షన్ లో ఇది రూపొందనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ప్రాధమిక చర్చలు జరుగుతుండగా త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. వందల కోట్ల బడ్జెట్ లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టె లైకా ప్రొడక్షన్స్ దీని నిర్మాణం చేపట్టబోతోంది. అయితే క్యాస్టింగ్ కు సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్లు రావాల్సి ఉంది.

ఈ జూడ్ ఆంటోనీ జోసెఫ్ తోనే చిరంజీవి సైతం ఒక మూవీ ప్లాన్ చేశారు కానీ ఒకవేళ ఓకే అయితే అది వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చు. స్టోరీ లైన్ మాత్రమే చర్చకు వచ్చింది తప్ప అంతకన్నా ముందుకు వెళ్ళలేదు. తమిళంలో వారసుడు చేసిన రష్మిక మందన్నకు అక్కడా పెద్ద బ్రేక్ రావాల్సి ఉంది. పుష్ప 2 షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో దాని ప్రభావం కొంత డేట్ల మీద ఇతర ప్రోజెక్టుల మీద పడింది. శ్రీలీల ఎంట్రీ తర్వాత పూజా హెగ్డేతో పాటు రష్మిక స్పీడ్ బాగా తగ్గిపోయింది. పోటీని ధీటుగా ఎదురుకోవాలంటే దానికి తగ్గట్టు కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.