త్రిముఖ వ్యూహంలో పవన్ త్రివిక్రమ్

దర్శకత్వం చేస్తోంది ఒక సినిమాకే అయినా త్రివిక్రమ్ మీద పలురకాల బాధ్యతలు, బరువులు ఉన్నాయి. ఇటీవలే బ్రో విషయంలో గట్టి విమర్శలే ఎదురుకోవాల్సి వచ్చింది. ఇక గుంటూరు కారం సంగతి తెలిసిందే. విపరీతమైన వాయిదాలు, మార్పులు, చేర్పుల మధ్య ఎట్టకేలకు షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడి ఆలోచనలు త్రిముఖ వ్యూహంలో కొనసాగుతున్నాయి. సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తో ముడిపడినవి కావడం విశేషం. సంక్రాంతిని మహేష్ బాబుకి మిస్ చేయకూడదన్న పట్టుదలతో త్రివిక్రమ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇది ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ ని వేగంగా పూర్తి చేసి పండగ బరిలో దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన పవన్ – హరీష్ శంకర్ – మైత్రిల మధ్యే ఇటీవలే చర్చకొచ్చిందట. ఒకవేళ అలా అనుకుంటే తన ప్రాణ మిత్రుడికి పోటీ వెళ్ళడానికి పవర్ స్టార్ ఇష్టపడడు. అటు త్రివిక్రమ్ కూడా అంతే. ఒకవేళ ఇలా వద్దనుకుంటే ఓజిని డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఉస్తాద్ ని వేసవికి వాయిదా వేసుకోవచ్చు. అయితే సుజిత్ కేవలం మూడున్నర నెలల్లో సెన్సార్ పూర్తి చేసిన కాపీ ఇవ్వగలడా అంటే ఓజి రేంజ్ ప్రకారం చూస్తే అంత సులభం కాదు.

హరీష్ శంకర్ కు ఆ సమస్య లేదు. ఉస్తాద్ ని ఫాస్ట్ గా తీయగలడు. పైగా పెద్దగా రిస్క్ లేని రీమేక్ కావడంతో సౌలభ్యం ఎక్కువగా ఉంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి త్రివిక్రమ్ సలహాలు, సూచనలు లేనిదే పవన్ ముందడుగు వేయలేడన్నది ఓపెన్ సీక్రెట్. బై ఛాన్స్ గుంటూరు కారం లేట్ అయితే అప్పుడా ప్లేస్ ని ఎంచక్కా ఓజికో ఉస్తాద్ కో వాడుకోవచ్చు, కానీ ఇదంతా అంత సులభంగా తేలే వ్యవహారం కాదు. ఏపిలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలో పవన్ ఫోకస్ ఎక్కువగా జనసేన మీద ఉంది. సినిమాలకు సంబంధించి ఏ మ్యాటరైనా పవన్ నుంచి మొదటి కాల్ త్రివిక్రమ్ కే వెళ్తోందట. చూడాలి మరి ఈ వ్యూహం ఎలా ముగుస్తుందో.