విక్రమ్ వదిలేశాడు సూర్య అందుకున్నాడు

కోలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోలు విక్రమ్, సూర్యలు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ముఖ్యంగా శివ పుత్రుడు టైంలో వీళ్ళ బాండింగ్ స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. దీంతోనే పెద్ద రేంజ్ కు చేరుకున్నారు. తర్వాత ఈ కాంబో సాధ్యపడలేదు. అయితే విక్రమ్ చేయాలని మనసుపడి కొంత కాలం షూటింగ్ జరుపుకున్న ఒక ప్యాన్ ఇండియా మూవీని ఇప్పుడు సూర్య చేయాలని డిసైడ్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మూడేళ్ళ క్రితం 2020లో ఆర్ఎస్ విమల్ దర్శకుడిగా సూర్యపుత్ర మహావీర్ కర్ణ మొదలయ్యింది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా వచ్చాయి.

అనూహ్యంగా ఇది ఆగిపోయింది. కరోనా వచ్చి వెళ్ళాక నిర్మాతలకు ఆసక్తి పోయింది. మహాభారతంలోని కర్ణుడి విశిష్టతను కొత్త టెక్నాలజీతో చెప్పాలని తొలుత ప్లాన్ చేసుకున్నారు. కానీ విక్రమ్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు సూర్య కర్ణగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మొత్తం వేరే టీమ్ తో. ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తారట. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్ అంటే సూర్య మాత్రం  ఎందుకు నో చెబుతాడు.

ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతా ఓకే అనుకున్నాక అఫీషియల్ గా ప్రకటిస్తారు. కర్ణ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్ ఆవిష్కరించిన వెండితెర అద్భుతం దానవీరశూరకర్ణ. నాలుగు గంటల నిడివితో అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సృష్టించిన సంచలనం గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. తర్వాత శివాజీ గణేశన్ లాంటి ఎందరో దిగ్గజాలు దాన్ని పునఃసృష్టి  చేయబోయారు కానీ ఒరిజినల్ ను కనీసం మ్యాచ్ చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఇంత విజువల్ ఎఫెక్ట్స్ ట్రెండ్ లో సూర్య ఎలా మరిపిస్తాడో చూడాలి. కంగువా తర్వాత వరసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి.