వైసీపీకి ‘బ్రో’ టీం థ్యాంక్స్ చెప్పాలి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ ముంగిట హైప్ ఉన్నా లేకున్నా.. తొలి రోజు, తొలి వీకెండ్లో థియేటర్లు కళకళలాడిపోతాయి. ‘బ్రో’ విషయంలో కూడా అదే జరిగింది. పవన్ కెరీర్లో అతి తక్కువ హైప్‌తో రిలీజైన చిత్రాల్లో ఇదొకటి. అయినా సరే.. ఆ ప్రభావం వీకెండ్ వసూళ్ల మీద పడలేదు. తొలి మూడు రోజులు థియేటర్లు నిండుగా కనిపించాయి. సినిమా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్, రూ.60 కోట్లకు చేరువగా షేర్ కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా వసూళ్లు సోమవారం ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి.

వీకెండ్ తర్వాత డ్రాప్ మామూలే కానీ.. మరీ 75 శాతం వసూళ్లు పడిపోవడం మాత్రం ఆందోళన కలిగించేదే. తర్వాతి రెండు రోజుల్లో కూడా వసూళ్లు ఇదే రేంజిలో కనిపించాయి. ఈవెనింగ్, నైట్ షోలకు మాత్రం కొంచెం పర్వాలేదన్నట్లు కలెక్షన్లు వస్తున్నాయి. ఐతే ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేకపోవడంతో వీకెండ్ మీద ‘బ్రో’ ఆశలు పెట్టుకుంది.

ఈ టైంలో ‘బ్రో’కు కొంచెం ప్రమోషనల్ సపోర్ట్ అవసరమైంది. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి తన సినిమాను ప్రమోట్ చేయడం అన్నది జరగదు. సాయిధరమ్ తేజ్ కొంచెం ట్రై చేస్తున్నాడు కానీ.. అతడి ప్రయత్నం సరిపోదు. హీరోయిన్లంతా సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ‘బ్రో’ను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తన వంతు ప్రయత్నం చేస్తోంది.

రెండు మూడు రోజులుగా ‘బ్రో’ వార్తల్లో నిలిచేలా చేస్తున్నది వైకాపా నేతలే. ముఖ్యంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఒకటికి రెండుసార్లు ప్రెస్ మీట్లలో ‘బ్రో’ సినిమాను టార్గెట్ చేశారు. దీని గురించి మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చేలా చేశాడు. అంతటితో ఆగకుండా ‘బ్రో’ ఫైనాన్షియల్ వ్యవహారాల మీద ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఆయన ఏకంగా ఢిల్లీకి వెళ్తున్నారట.

అంటే జాతీయ స్థాయిలో కూడా ‘బ్రో’ గురించి చర్చ జరిగేలా ఆయన చేయబోతున్నట్లు కనిపిస్తోంది. అంబటికి మద్దతుగా వైసీపీ శ్రేణులు సైతం ‘బ్రో’ను టార్గెట్ చేస్తున్నాయి. వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో ‘బ్రో’ గురించిన పోస్టులు పెడుతున్నారు. నెగెటివ్ ప్రచారంతో అయినా ‘బ్రో’ గురించి చర్చ జరిగేలా చేస్తోంది వైసీపీ వాళ్లే. ఇలా ఆ సినిమా వీకెండ్ వసూళ్లు పెరిగేలా మంచి ప్రమోషన్ ఇస్తున్నందుకు చిత్ర బృందం వైసీపీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే.