బ్రహ్మాస్త్ర రెండో పార్ట్ లేదా?

బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం.. బ్రహ్మాస్త్ర. మేకర్స్ చెప్పుకున్న ప్రకారం అయితే ఈ సినిమాకు పెట్టిన ఖర్చు రూ.400 కోట్లకు పైమాటే. ఇక బిజినెస్ రూ.500 కోట్లకు పైగానే చేశాడు నిర్మాత కరణ్ జోహార్. గత ఏడాది దసరా టైంలో రిలీజైన ‘బ్రహ్మాస్త్ర’ ఓపెనింగ్స్ అయితే బాగానే రాబట్టింది. ఆ తర్వాత కూడా ఓ మోస్తరుగా ఆడింది. ఐతే ఓవరాల్‌గా ఈ సినిమా బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది.

మేకర్స్ మాత్రం ఇదొక బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ రిలీజైనపుడే ఇంకో రెండు భాగాలు వస్తాయని ప్రకటించారు. సినిమాలో సెకండ్ పార్ట్‌కు హింట్ కూడా ఇచ్చాడు. కానీ బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘బ్రహ్మాస్త్ర-2’ ఉండదట. ఈ సినిమా తీయడానికి నిర్మాత కరణ్ జోహార్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్లు సమాచారం. ఇది తలకు మించిన భారం అని ఆయన భావిస్తున్నారట.

‘బ్రహ్మాస్త్ర’కు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ ఆ సినిమా మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే మాత్రం ఆ వసూళ్లు తక్కువే. బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. పీఆర్ మేనేజ్మెంట్‌తో సినిమా హిట్ అని చెప్పుకున్నా.. వాస్తవం ఏంటన్నది బయ్యర్లకు, నిర్మాతకు బాగా తెలుసు. సెకండ్ పార్ట్ అంటే మళ్లీ వందల కోట్ల బడ్జెట్ పెట్టాలి. ‘బ్రహ్మాస్త్ర’కు ఆ మాత్రం వసూళ్లు రప్పించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది.

మరోసారి ఈ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కూడా చాలా కష్టమే అవుతుంది. అందుకే కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్ర-2’ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈ సినిమా ఇప్పటికే మొదలు కావాల్సింది. కానీ అవ్వలేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి వేరే సినిమా మీద దృష్టిసారించాడు. కరణ్ కూడా వేరే సినిమాల మీదికి వెళ్లిపోయాడు. కాబట్టి ‘బ్రహ్మాస్త్ర-2’ లేదని ఫిక్సయిపోవచ్చు.