సరైన టైంలో క్లాసు తీసుకున్న పవన్

నిన్న అట్టహాసంగా జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కోలీవుడ్ పరిశ్రమపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముప్పై అయిదు నిమిషాల తన సుదీర్ఘ ప్రసంగంలో ఇటీవలే తమిళ నటీనటుల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల గురించి గట్టి క్లాసు తీసుకున్నారు. కేవలం తమ రాష్ట్రానికి చెందినవాళ్లనే తీసుకోవాలంటూ, అత్యవసరమైతేనే షూటింగులు బయట చేయాలంటూ ఇచ్చిన గైడ్ లైన్స్ పట్ల ఇప్పటికే పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ ఇష్యూ గురించి ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీ తరఫున ఎవరూ మాట్లాడలేదు. పవనే స్పందించాడు.

ఏ భాషలో సినిమాలు తీసేవాళ్ళయినా సరే ప్రాంతీయ పరిమితులు పెట్టుకోకూడదని, బ్రోకు పని చేసిన సముతిరఖని తమిళనాడు, ఛాయాగ్రహణం నిర్వహించిన సుజిత్ వాసుదేవన్ కేరళ, పబ్బు సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా ముంబై నుంచి వచ్చారని ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలమని హితవు పలికారు. రోజా, జెంటిల్ మెన్ లాంటివి తీసిన ఏఎం రత్నం తెలుగువాడేనని గుర్తు చేశారు. నిజానికి రత్నం నిర్మించింది భారతీయుడు, బాయ్స్ విజయ్ ఖుషి వగైరాలు. పవన్ ఉదాహరించినవి డబ్బింగ్ చేసినవి. స్పీచ్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సరైన టైంలోనే క్లాసు తీసుకున్నారు. కేవలం తమిళులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనడం సరికాదు. అలా అయితే కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, తెలుగు మూలాలున్న విశాల్ తదితరులను బయటికి పొమ్మని అనలేరు కదా. అయినా ఆర్ఆర్ఆర్ లాగా పొన్నియిన్ సెల్వన్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. కేవలం అరవ ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే. గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలు కోలీవుడ్ నుంచి వచ్చి చాలా కాలమయ్యింది. అలా ఎందుకు జరుగుతుందో గుర్తించకుండా చర్యలకు దిగడం ఫలితాన్ని ఇవ్వదు.