టాలీవుడ్ తల మీద వర్షం పిడుగు

శుభామా అని బేబీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతూ ఈ గురు శుక్రవారాలు బోలెడు కొత్త సినిమాలు రిలీజవుతుంటే టాలీవుడ్ నెత్తి మీద వర్షం పిడుగు పడింది. ఎడతెరిపి లేని కుంభవృష్టితో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. నిన్న కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామైపోయి గంటల కొద్దీ జనం రోడ్ల మీద వాహనాల్లో ఎదురు చూడాల్సి వచ్చింది. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ గట్టి జల్లులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే పనిగా హోరు వానలో తడుచుకుంటూ థియేటర్లకు వెళ్లే మూడ్ లో అధిక శాతం ప్రేక్షకులు ఉండరు.

ఇవాళ చాలా సినిమాలు విడుదలయ్యాయి. హత్య, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, హర్ చాఫ్టర్ వన్, డిటెక్టివ్ కార్తిక్, నాతో నేను, ఒక్కడే వీరుడు,  కాజల్ కార్తీక, అలా ఇలా ఎలాతో పాటు హాలీవుడ్ మూవీస్ ఓపెన్ హెయిమర్, బార్బీలు వచ్చాయి. హిడింబ నిన్నే దిగాడు. వీటికి షోల సర్దుబాటు చేయడమే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్ గా మారింది. బేబీ స్ట్రాంగ్ రన్ వల్ల అధిక శాతం థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. అయినా సరే కొత్తగా వచ్చిన పదకొండు చిత్రాలకు షోలు ఇవ్వక తప్పని పరిస్థితి. సరే ఏదోలా అడ్జస్ట్ మెంట్లు చేశారు కానీ ఇప్పుడీ వరుణ దేవుడి దెబ్బకు వసూళ్లకు కోత పడేలా ఉన్నాయి.

ఎందుకంటే ఏ సినిమాకైనా మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా కీలకం. ఆడియన్స్ లో ఆసక్తి రేపడానికి టాక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా వచ్చినవన్నీ దాదాపు చిన్న చిత్రాలే. స్టార్ క్యాస్టింగ్ లేనివి. కేవలం కంటెంట్ ని నమ్ముకుని వచ్చాయి. ఇలాంటి టైంలో జనం బయటికి రావడం అవసరం. వాతావరణం చూస్తుంటే ఇంకో రెండు మూడు రోజులు ఇదే సీన్ ఉండేలా కనిపిస్తోంది. అసలే వచ్చే వారం పవన్ కళ్యాణ్ బ్రో ఉంటుంది. ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలి. ఎలాగూ అగ్రిమెంట్లు, స్క్రీన్ కౌంట్ తగ్గిపోతుంది. అందుకే నిర్మాతల గుండెల్లో కలెక్షన్ల పరంగా  రైళ్లు పరిగెడుతున్నాయి.