3 వారాల తర్వాత ఆదిపురుష్ రచయిత క్షమాపణ

భారీ అంచనాలతో మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లు కొల్లగొట్టేంత రేంజ్ లో వసూళ్లు రాబట్టినా, ఫైనల్ గా డిజాస్టర్ ముద్ర వేయించుకున్న ఆదిపురుష్ థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాకపోవడంతో దీన్నే చాలా చోట్ల ఫీడింగ్ కోసం కొనసాగిస్తున్నారు. వసూళ్ల పరంగా పెద్దగా ఫిగర్లు నమోదు కానప్పటికీ ఇంకో వారం బండి లాగేందుకు బయ్యర్లు ప్రయత్నిస్తున్నారు. నార్త్ లో మాత్రం పూర్తిగా వాష్ అవుట్ అయిన ఈ ఎపిక్ డ్రామా మీద ఎన్ని వివాదాలు నడిచాయో చూశాం. అలహాబాద్ కోర్టు తీవ్రంగా అక్షింతలు కూడా వేసింది.

ఈ నేపథ్యంలో రచయిత మనోజ్ ముంతషీర్ మూడు వారాల తర్వాత క్షమాపణ చెప్పాడు. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఓసారి రామాయణాన్ని తీశామని, మరోసారి లేదు కేవలం స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశామని  ఏదేదో బుకాయించాడు. దీని మీద తీవ్ర విమర్శలు చెలరేగాయి. అయినా కూడా సమర్ధించుకుంటూనే వచ్చాడు. కట్ చేస్తే వ్యవహారం న్యాయస్థానానికి వెళ్ళాక స్వరం మార్చాడు. ట్విట్టర్ వేదికగా ఆదిపురుష్ వల్ల జనాల మనోభావాలు దెబ్బతిన్నాయని, మనస్ఫూర్తిగా చేతులు జోడించి క్షమాపణ వేడుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు.

మన దేవుడు భజ్ రంగ్ బలి అందరనీ ఐకమత్యంగా ఉంచుతూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ దానికి కావల్సిన బలాన్ని సమకూరుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇది ఒకరకంగా మంచిదే అయినా జూలై చివరి వారంలో కోర్టుకు  ఆదిపురుష్ టీమ్ హాజరు కావాల్సిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మనోజ్ ఈ సారీ ట్వీట్ పెట్టాడని ముంబై విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ లాజిక్ కనిపిస్తోంది. రచయిత కాబట్టి జడ్జ్ నిలదీసినప్పుడు ఇదిగోండి నేను తప్పు ఒప్పుకున్నానని ఆధారం చూపించొచ్చు. ఆలస్యమైతేనేం ఆదిపురుష్ విషయంలో తప్పు చేశానని మనోజ్ ఒప్పుకోవడం స్వాగతించాల్సిన విషయమే