తెలుగు మార్కెట్ ని తక్కువంచనా వేశారా  

షారుఖ్ ఖాన్ సినిమాలకు దక్షిణాది రాష్ట్రాల వరకు చూసుకుంటే అత్యధిక రెవిన్యూ ఇచ్చేది ఏపీ, తెలంగాణనే. అందులోనూ నైజాం చాలా కీలకమైంది. పఠాన్ ని ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. పాతికేళ్ల క్రితం డిడిఎల్, బాజీగర్, డర్ లాంటి బ్లాక్ బస్టర్స్ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇతని కొత్త మూవీ జవాన్ సెప్టెంబర్ 7 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల జూలై 7న చెన్నై వేదికగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. అత్యంత ఖరీదైన వేడుకగా దీన్ని ప్లాన్ చేసినట్టు కోలీవుడ్ టాక్.

నిజానికి ముంబైలో చేయాల్సిన ఇలాంటి సంబరాన్ని చెన్నైలో ప్లాన్ చేసుకోవడం వెనుక కారణం సింపుల్. దర్శకుడు ఆట్లీ, హీరోయిన్ నయనతార, విలన్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇలా మొత్తం ఆరవ గ్యాంగే సినిమాకు పని చేసింది. సో సహజంగానే సాంబార్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అసలు కథనే కమల్ హాసన్ ఖైదీ వేట నుంచి స్ఫూర్తి చెంది రాసుకున్నారనే టాక్ ముందు నుంచి ఉంది. అది నిజమో కాదో కానీ షారుఖ్ సైతం ఈసారి సౌత్ బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట

అయితే తెలుగు మార్కెట్ ని మాత్రం జవాన్ టీమ్ తేలికగా తీసుకుందేమోననే అనుమానామాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆట్లీ ఎలాంటి పేరున్న టాలీవుడ్ ఆర్టిస్టులను తీసుకోలేదు. ప్రశాంత్ నీల్ నయం. కెజిఎఫ్ 2 కోసం రావు రమేష్ లాంటి వాళ్ళను పెట్టి లోకల్ టచ్ పెంచాడు. కానీ జవాన్ విషయంలో అట్లీ అలాంటి జాగ్రత్తలేమీ పాటించలేదు. బాలీవుడ్ మూవీనే అయినా వీలైనంత తమిళ టీమ్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంత భారీ స్థాయిలో షారుఖ్ చేయబోయే మొదటి సౌత్ ఈవెంట్ ఇదే.  తర్వాత హైదరాబాద్లో ఏదైనా ప్లాన్ చేస్తారా అంటే యూనిట్ నుంచి ఉండకపోవచ్చనే సమాధానమే వస్తోంది