రిస్క్ తగ్గించుకున్న బోయపాటి రాపో

దసరా పండగ ఇంకా చాలా దూరం ఉండగానే బాక్సాఫీస్ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆల్రెడీ పండగ సీజన్ మీద బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియోలు అఫీషియల్ గా కర్చీఫ్ వేశాయి. అక్టోబర్ 20ని టార్గెట్ చేసుకుని మూడు సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. వీటికి థియేటర్ల సర్దుబాటు పెద్ద ఛాలెంజ్ అవుతుందని బయ్యర్లు ఆల్రెడీ మల్లగుల్లాలు పడుతున్నారు. వీటికన్నా ముందే టైటిల్ ఇంకా నిర్ణయించని బోయపాటి శీను ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబోల సినిమా కూడా విజయదశమికే ఫిక్స్ కావడం పరిస్థితిని జటిలంగా మార్చింది

అనూహ్యంగా బోయపాటి రాపో మూవీని ప్రీ పోన్ చేస్తూ సెప్టెంబర్ 15 కి విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పంచెకట్టుతో మంచెం మీద పొలం మధ్యలో రామ్ కూర్చున్న కొత్త పోస్టర్ తో పాటు ఈ విషయాన్ని ధృవీకరించారు. సో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి డేట్ ని అందిపుచ్చుకున్న టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేయాల్సి ఉంటుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో రామ్ ని గతంలో చూసిన ఇస్మార్ట్ శంకర్ కంటే ఊర మాస్ క్యారెక్టర్ లో బోయపాటి చూపిస్తారట. దీనికోసమే రామ్ ప్రత్యేకంగా ఒళ్ళు గెడ్డం పెంచాడు

అలా అని ఎవరూ పోటీ లేదని కాదు. ఇంతకు ముందే డీజే టిల్లు స్క్వేర్ ని సెప్టెంబర్ 15కి లాక్ చేశారు. కాకపోతే సిద్దు జొన్నలగడ్డ చేసేది కంప్లీట్ యూత్ ఫుల్ క్రైమ్ కామెడీ కాబట్టి బాక్సాఫీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి ఈ రెండు మాత్రమే ఆ తేదీకి షెడ్యూల్ అయ్యాయి. దసరా నుంచి తప్పుకోవడం వల్ల బోయపాటి రాపోకి ఓపెనింగ్స్ ని ఇంకో పెద్ద హీరోతో షేర్ చేసుకునే ప్రమాదం తప్పింది. మాస్ మార్కెట్స్ లో సోలోగా జనాన్ని ఆకట్టుకునే ఛాన్స్ దొరికింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఏం పేరు పెడతారనే సస్పెన్స్ ఇంకా తీరలేదు