తమన్‌కు మండింది.. గట్టిగా ఇచ్చాడు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఐతే ఒక నెగెటివ్ వార్తతో తన పేరు ట్రెండ్ అవుతుండటం గమనార్హం. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి తమన్‌ను తొలగించారన్నది ఆ వార్త సారాంశం. సోషల్ మీడియాలోనే కాక వెబ్ సైట్లలో ప్రముఖంగా ఆ వార్త హల్‌చల్ చేసింది.

తమన్ వర్క్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేకపోవడం వల్ల త్రివిక్రమ్ అయిష్టంగానే తమన్‌ను తప్పించాల్సి వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐతే చిత్ర వర్గాల నుంచి అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొన్ని మీడియా సంస్థలు నిర్మాత నాగవంశీని సంప్రదిస్తే.. ఈ వార్త నిజం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమన్‌ను ఈ సినిమా నుంచి తప్పించలేదంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టుకు థమ్సప్ సింబల్‌తో రిప్లై కూడా ఇచ్చాడు నాగవంశీ.

కాబట్టి తమన్‌ ‘గుంటూరు కారం’లో కొనసాగుతున్నట్లే భావించాలి. ఇదిలా ఉండగా.. తన గురించి ఈ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి తమన్ ట్విట్టర్ ద్వారా గట్టిగా పంచ్ ఇచ్చాడు. తన విషయంలో అసూయ చెందుతున్న వాళ్లకు కడుపు మంట తగ్గేందుకు అతను కొన్ని సూచనలు చేశాడు. అరటిపళ్లు తింటే కడుపు మంట తగ్గుతుందని.. అలాగే మజ్జిగ కూడా బాగా పని చేస్తుందని.. తన ఆఫీస్‌లో ఉచితంగా మజ్జిగ అందించబోతున్నానని.. ఇలాంటి వాళ్లు అందరూ వచ్చి తాగి ఉపశమనం పొందాలని తమన్ కౌంటర్ వేశాడు.

నిజంగా మహేష్ సినిమా నుంచి ఈ దశలో తమన్‌ను తప్పించేట్లయితే.. అది అతడికి చాలా ఇబ్బంది కలిగించే విషయమే. నిర్మాత నుంచే క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక ఈ ప్రచారాన్ని ఆపేసి ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదేమో. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రానున్న కొత్త సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు తెలుస్తోంది.