పది సినిమాలు చాలంటున్న లియో దర్శకుడు  

న్యూ జనరేషన్ ఫిలిం మేకర్స్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో హీరోయిజంని కొత్త తరహాలో ప్రెజెంట్ చేస్తాడనే పేరు కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోల ఆఫర్లు తీసుకొచ్చింది. గత ఏడాది విక్రమ్ సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. అంతకు ముందు విజయ్ తో తీసిన మాస్టర్, కార్తీ ఖైదీ వేటికవే ప్రత్యేకమైనవి. ఇతని మొదటి మూవీ మానగరం ఆరేళ్ళ తర్వాత హిందీలో రీమేక్ చేసుకున్నారంటేనే తన కథలు ఎంత కాంటెంపొరరీగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇతను అక్టోబర్ విడుదలకు రెడీ అవుతున్న లియోతో బిజీగా ఉన్నాడు.

లోకేష్ తాజా స్టేట్ మెంట్ అభిమానులను కలవరపరిచేలా ఉంది. తాను ఎక్కువ సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి రాలేదని, ఒక పది తీశాక రిటైర్ అయిపోతానని చెప్పాడు. అంటే లియో మినహాయించి ఇంకో అయిదు మాత్రమే వస్తాయన్న మాట. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ లో భాగంగా తాను తీసిన కథల్లోని హీరోలందరినీ ఒక చోట కలుపుతానని, అవెంజర్స్ లాగా వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచేలా చేస్తానని అంటున్నాడు. అయితే దీనికి సదరు హీరోలు, నిర్మాతలు అభ్యంతరం లేదని ఒప్పుకుంటే తప్ప అది సాధ్యపడదని కూడా క్లారిటీ ఇచ్చాడు.

లోకేష్ ప్లాన్ చేసుకున్న వాటిలో విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ఉన్నాయి. రామ్ చరణ్ తో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపించిన లోకేష్ కనగరాజ్ నిజంగా తెలుగు డెబ్యూ చేస్తాడానేది అనుమానంగానే ఉంది. అయినా ఇలాంటి యంగ్ టాలెంట్స్ కొన్ని సినిమాలు చేసి తప్పుకుంటామని చెప్పుకోవడం ఎంత మాత్రం స్వాగతించే విషయం కాదు. ఒకప్పుడు దాసరి, కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు వందకు పైగా దర్శకత్వం వహించి చరిత్ర సృష్టించారు. మరీ అన్ని కాకపోయినా కనీసం ఓ పాతిక యాభై అయినా చేయకపోతే చరిత్రలో నిలిచేదెలా. లోకేష్ మనసు మారాలని మూవీ లవర్స్ కోరిక