స్టార్ రైటర్… నాగ్ నుండి రవితేజ? 

‘సినిమా చూపిస్తా మావ’ సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అక్కడి నుండి వరుస హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ తాజాగా ధమాకా తో స్టార్ రైటర్ లిస్టులో చేరిపోయాడు. ఆ సినిమా తర్వాత నాగార్జున, ప్రసన్న కుమార్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. నాగ్ కోసం ఓ రీమేక్ కథను తన స్టైల్ లో మార్పులు చేసి అంతా రెడీ చేసుకున్న ప్రసన్న ఇప్పుడు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో రీమేక్ రైట్స్ ఇబ్బందులు తలెత్తాయి. అభిషేక్ అగర్వాల్ చేతిలో రీమేక్ రైట్స్ ఉండటంతో నిర్మాత శ్రీనివాస్ చిత్తూరి , ప్రసన్నకుమార్ ఇద్దరు రీమేక్ రైట్స్ ఇష్యూ ను ఫేస్ చేయాల్సి వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ రీమేక్ సినిమా క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. ప్రసన్న ఈ సినిమా నుండి అవుట్ అంటున్నారు. మరి నాగ్ , నిర్మాత శ్రీనివాస్ కలిసి మరో దర్శకుడితో ఈ రీమేక్ చేస్తారా ? లేదా మరో కథ ఎంచుకుంటారా ? తెలియాల్సి ఉంది.

ఇక ధమాకా తో రవితేజ కి భారీ సక్సెస్ అందించిన రైటర్ ప్రసన్న తాజాగా మాస్ మహారాజాకి ఓ కథ వినిపించి లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది.  రవితేజ ఇప్పటికే చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు రైటర్ ప్రసన్న ను దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు ప్రసన్న కుమార్. ఈ సినిమా అయ్యాక రవితేజతో తన డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ లోపు రవితేజ గోపీచంద్ మలినేనితో సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట.