రవితేజ.. ఇంకో రెండు సినిమాలు

టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే కథానాయకుల్లో రవితేజ ఒకడు. క్యారెక్టర్, విలన్ వేషాలను పక్కన పెడితే.. హీరోగానే ఆయన సినిమాలు 60కి దగ్గరగా ఉండటం విశేషం. పెద్ద స్టార్ అయ్యాక కూడా ఏడాది రెండు మూడు రిలీజ్‌లతో సాగిపోతున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో పలకరించాడు మాస్ రాజా.

దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ రాబోతోంది. ఆ తర్వాత మూడు నెలలకే సంక్రాంతికి ‘ఈగల్’ వస్తుంది. ప్రస్తుతం టైగర్, ఈగల్ చిత్రాల షూటింగ్‌లో సమాంతరంగా పాల్గొంటున్న రవితేజ.. మరోవైపు కొత్త సినిమాల కోసం కథలు వింటున్నాడు. ఆయన ఒకేసారి రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి ఓ కొత్త దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది.

వాసు అనే డెబ్యూ డైరెక్టర్‌తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నాడు. సితార బేనర్లో రవితేజ చేయబోయే తొలి చిత్రం ఇదే. మాస్ రాజాతో సినిమా కోసం సితార వాళ్లు గతంలోనూ ప్రయత్నించారు. ‘భీమ్లా నాయక్’లో రానా పాత్రను రవితేజతోనే చేయించాలని కూడా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాస్ రాజా శైలికి తగ్గ కథతో వచ్చిన వాసుతో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు.

మరోవైపు తనకు డాన్ శీను లాంటి హిట్.. బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మాస్ రాజా మళ్లీ జట్టు కట్టబోతున్నాడట. వీరి కలయికలో మైత్రీ సంస్థ సినిమా తీయబోతోందట. గోపీచంద్ చివరి సినిమా ‘వీరసింహారెడ్డి’ని ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రీ వాళ్లే. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీ వేరే ప్రయత్నాలేవో చేశాడు కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ రవితేజతో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది.