ధనుష్ సినిమా ఒకటి కాదు.. మూడు

ఇండియాలో భాష, ప్రాంతీయ భేదం లేకుండా అందరూమంచి నటుడిగా గుర్తించే హీరోల్లో ధనుష్ ఒకడు. తమిళంలో పెద్ద బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా అడుగు పెట్టి స్వశక్తితో ఎదిగిన అతను.. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చాడు. అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను.. బాలీవుడ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను అతను మెప్పించాడు. ఈ మధ్యే ‘సార్’ అనే డైరెక్ట్ తెలుగు సినిమాతో మన ఆడియన్స్‌కు మరింత కనెక్టయ్యాడు.

ఈ సినిమాతో వచ్చిన ఫాలోయింగ్‌తో ధనుష్ ఇక నుంచి తెలుగులో పెద్ద స్థాయిలోనే తన సిినిమాలను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ‘సాని కాయిదం’ చిత్రంతో డెబ్యూలోనే ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మన తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో కీలక పాత్ర చేస్తుండటం విశేషం.

‘కెప్టెన్ మిల్లర్’ను ముందు ఒక సినిమానే అనుకున్నారంతా. కానీ ఇది ఫ్రాంఛైజీ ఫిలిం అట. మూడు బాగాలుగా తెరకెక్కనుందట. ‘కేజీఎఫ్’ తరహాలో చాప్టర్లు, చాప్టర్లుగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. బ్రిటిష్ వారితో పోరాటం నేపథ్యంలో తొలి చాప్టర్ నడుస్తుందట. అది 1940లో నడిచే కథ అని సమాచారం. రెండో భాగం 1990 ప్రాంతంలో నడుస్తుందట. ఇక చాప్టర్ 3 వర్తమానంలో నడిచే కథతో తెరకెక్కుతుందని సమాచారం.

చూస్తుంటే ‘కెప్టెన్ మిల్లర్’ సెన్సేషనల్ ఫ్రాంఛైజీగా మారేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుల్ మోహన్ ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ధనుష్ తన గెటప్ మొత్తం మార్చేశాడు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిలిమ్స్ దాదాపు వంద కోట్ల బడ్జెట్లో నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.