హీరో త‌ల్లి నుంచి 58 ల‌క్ష‌లు కొట్టేశాడు

బాగా చ‌దువుకున్న వాళ్లు, సెల‌బ్రెటీలు, పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేవాళ్లు కూడా కొన్నిసార్లు మోసాల‌కు గుర‌వుతుంటారు. ఇది అలాంటి ఉదాహ‌ర‌ణే. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక‌డైన టైగ‌ర్ ష్రాఫ్ కుటుంబాన్ని వాళ్ల ద‌గ్గ‌ర ప‌ని చేసే అలెన్ ఫెర్నాండో అనే వ్య‌క్తి పెద్ద మోస‌మే చేశాడు. టైగ‌ర్ త‌ల్లి ద‌గ్గ‌ర ఏకంగా రూ.58 ల‌క్ష‌లు కాజేశాడు ఫెర్నాండో. టైగ‌ర్ కుటుంబానికి అత‌ను న‌మ్మ‌క‌మైన వ్య‌క్తే. కొన్నేళ్ల నుంచి వాళ్ల ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్నాడు.

టైగ‌ర్ మొద‌లుపెట్టిన ఎంఎంఏ మ్యాట్రిక్స్ జిమ్ వ్య‌వ‌హారాల‌ను అత‌డి త‌ల్లి ఆయేషా ష్రాఫ్‌తో క‌లిసి ఫెర్నాండోనే చూసుకుంటున్నాడు. ఈ జిమ్ చైన్‌కు దేశంలో ప‌లు న‌గ‌రాల్లో ఫ్రాంఛైజీలు ఉన్నాయి. కోట్ల‌ల్లో ట‌ర్నోవ‌ర్ ఉంది. ఐతే ఈ జిమ్ చైన్‌కు ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న ఫెర్నాండో.. త‌మ సంస్థ పేరు మీద టోర్న‌మెంట్లు నిర్వ‌హించే ప్ర‌తిపాద‌న‌తో టైగ‌ర్ త‌ల్లి ఆయేషా నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నాడు.

ఈ మొత్తం రూ.56 ల‌క్ష‌లను అత‌ను ఏ టోర్నీల కోసం ఖ‌ర్చు పెట్ట‌కుండా సొంతానికి ఉప‌యోగించుకున్నాడు. ఆల‌స్యంగా మోసాన్ని గ్ర‌హించిన ఆయేషా.. ఫెర్నాండో మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వాళ్లు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయ‌డ‌మే కాక‌.. ఫెర్నాండోను అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారిస్తున్నారు. 2018లో టైగ‌ర్ త‌న సోద‌రితో క‌లిసి ఎంఎంఏ జిమ్‌ను మొద‌లుపెట్టాడు. ఐతే టైగ‌ర్ షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టంతో అత‌డి త‌ల్లే ఈ జిమ్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటోంది. ఫెర్నాండో ఆమెకు సాయ‌ప‌డుతున్నాడు. ఐతే ఒక వెర్షన్ మాత్రమే విని ఫెర్నాండో మీద ఒక అంచనాకు రాలేం. పోలీసుల విచారణ అనంతరం అతడి వెర్షన్ ఏంటో బయటికి రావచ్చు.