చేతులు మారిన ప్ర‌భాస్ కొత్త సినిమా

ప్ర‌భాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం అయితే ఆ త‌ర్వాత మ‌రో మూడు నెల‌ల‌కే ‘స‌లార్’.. ఇంకో నాలుగు నెల‌ల‌కే ‘ప్రాజెక్ట్ కే’ కూడా రిలీజైపోతాయి. ఆ త‌ర్వాత మరి కొన్ని నెల‌ల‌కే మారుతి సినిమా కూడా వ‌చ్చేస్తుంది. ఈ ఏడాది చివ‌ర్లోపు చేతిలో ఉన్న సినిమాల‌న్నింటినీ పూర్తి చేసే ప్ర‌ణాళిక‌లో ఉన్నాడు ప్ర‌భాస్.

ఇవన్నీ అయ్యాక ప్రభాస్ చేయాల్సిన సినిమా.. స్పిరిట్. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ పేరుతో ప్రభాస్ చాన్నాళ్ల క్రితమే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టీ సిరీస్ వాళ్లు.. ప్రభాస్ హోం బేనర్ అనదగ్గ యువి క్రియేషన్స్‌తో కలిసి భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఐతే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కీలక మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం.

యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారన్నది తాజా కబురు. ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా చేస్తున్న పీపుల్స్ మీడియా అధినేతలు.. టీ సిరీస్ వాళ్లతో చేతులు కలుపుతున్నారట. విశేషం ఏంటంటే.. ‘ఆదిపురుష్’ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స మీడియా వాళ్లు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్న తరుణంలోనే ‘స్పిరిట్’ కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

అంటే ప్రభాస్ మీద వాళ్లకు బాగా గురి కుదిరి.. అతడితో అనుబంధం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ‘యువి’ వాళ్లను పక్కన పెట్టి మరీ పీపుల్స్ మీడియా వాళ్లకు మరో సినిమా చేయడానికి ప్రభాస్ సిద్ధం కావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం ‘యానిమల్’ పనిలో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి.. ఈ ఏడాది చివర్లో ప్రభాస్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టనున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.