మెన్ టూ ఎవరూ పట్టించుకోలేదేం

నిన్న రిలీజైన కొత్త సినిమాల్లో అందరి చూపు మేం ఫేమస్, 2018ల మీద ఉండటంతో మిగిలిన వాటి మీద ఆడియన్స్ దృష్టి అంతగా పోలేదు. వాటిలో మెన్ టూ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పకుల్లో ఒకరిగా ఉండటం వల్ల థియేట్రికల్ గా ఇంత పోటీలోనో స్క్రీన్లు దొరికాయి. అయితే సరైన రీతిలో ప్రమోషన్లు చేయకపోవడంతో ఓపెనింగ్స్ రాలేదు. దాని తోడు ట్రైలర్ సైతం ఏదో స్పెషల్ కంటెంట్ ఉందనే  అభిప్రాయం కలిగించలేదు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని ఎవరూ పట్టించుకోలేదు సరే కానీ ఇంతకీ సినిమా ఎలా ఉంది

ఇది ప్రధానంగా నలుగురు మగాళ్ల చుట్టూ తిరిగే కథ. స్టాగ్స్ ఓన్లీ అనే పబ్ లో ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్ ఘంటసాల), మున్నా(మౌర్య సిద్ధవరం) రెగ్యులర్ గా కలుసుకుంటూ తమ జీవితంలో అమ్మాయిల వల్ల కలిగిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ రాహుల్(వైవా హర్ష) పరిచయమవుతాడు. ఆఫీస్ లో ఫిమేల్ హరాస్మెంట్ బాధితుడు. ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో హఠాత్తుగా ఒక కుదుపు వస్తుంది. అదేంటి తమ సమస్యలను వీళ్లెలా పరిష్కరించుకుని లవర్స్ కి భార్యలకు బుద్ది చెప్పుకున్నారనేది అసలు సినిమాలో చూడాలి.

ఎఫ్2, సేవ్ ది టైగర్స్ తరహా నేపధ్యమే తీసుకున్న శ్రీకాంత్ జి రెడ్డి దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఎక్కడా కూడా ఇంటరెస్టింగ్ అనిపించే సన్నివేశాలు, హాయిగా నవ్వుకునే కామెడీ ఏదీ లేకుండా కేవలం సీన్ల మీద ఆధారపడి అసలు కథను సరిగా రాసుకోలేదు. థియేటర్ కు వచ్చేంత కంటెంట్ కానీ క్యాస్టింగ్ ఇందులో లేదు. అలాంటప్పుడు ఫన్ మీద దృష్టి పెట్టి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగితే కనీసం టార్గెట్ మగ భాధితులకైనా రీచ్ అయ్యేది. ఆ అవకాశాన్ని చేతులారా వృథా చేసుకున్నారు. ఓటిటిలోనే కష్టమనిపించే మెన్ టూకి సారీ చెప్పడం తప్ప ఏం చేయలేం