అంబానీ మీద థియేటర్ ఓనర్ల గుస్సా

అవును ఎగ్జిబిటర్లకు ముఖేష్ అంబానీ మీద కోపం వచ్చేస్తోంది. దానికి కారణం జియో సినిమా యాప్. ఎలాంటి రుసుముల లేకుండా వారానికో కొత్త సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించడమే కాదు ఆచరణలో కూడా చేసి చూపించడంతో నార్త్ ఇండస్ట్రీ ఇంకా కిందకు వెళ్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వారం గ్యాప్ లో షాహిద్ కపూర్ బ్లడీ డాడీ, విజయ్ సేతుపతి ముంబైకర్ ను ఉచితంగా అందిస్తామని ట్రైలర్లతో సహా అనౌన్స్ మెంట్లు ఇవ్వడంతో ఈ ప్రభావం బాలీవుడ్ మీద తీవ్రంగా ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే జియో దగ్గర ఇప్పటికే వంద సినిమాలు, సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. వారానికి ఒకటి వేసుకున్నా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ అంబానీ టీమ్ ప్లాన్ అది కాదు. అవసరమైతే వారానికి రెండు మూడు స్ట్రీమింగ్ చేసి ఇతర ఓటిటిలకు ఉన్న సబ్స్క్రైబర్లను తమవైపు లాక్కోవాలని స్కెచ్ వేస్తోంది. ఒకవేళ డబ్బులు కట్టడానికి ఇష్టపడకపోతే ఎలాగూ ఫ్రీ కంటెంట్ దొరుకుతోంది కాబట్టి గంటల తరబడి యాప్ లో గడపడం వల్ల భేషుగ్గా మిలియన్లలో వ్యూస్ తో కోట్లలో పెట్టుబడి వచ్చేస్తుంది. ఇప్పటికిప్పుడు లాభాలు వచ్చేయాలనే అత్యాశ జియోకి లేదు

ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పెను దుమారం రేపుతాయని ట్రేడ్ భయపడుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా బాలీవుడ్ లో నమోదైన బ్లాక్ బస్టర్ పఠాన్ ఒక్కటే. దాని తర్వాత వచ్చినవన్నీ టపా కట్టేశాయి. తూ ఝూటి మై మక్కర్ హిట్టు కొట్టింది. కానీ బాక్సాఫీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సౌత్ డబ్బింగులను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఛత్రపతి రీమేక్ ని నిర్మొహమాటంగా తిప్పి కొట్టారు. రొటీన్ కంటెంట్ తో వస్తే సల్మాన్ ఖాన్ కే పరాభవం తప్పలేదు. ఇలాంటి పరిస్థితిలో జియో సినిమా ఇలా ఉచిత స్కీములు పెడితే ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టకుండా ఉంటారా