ముందే రామ్-బోయపాటి విందు

నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ లాంటి భారీ హిట్ కొట్టాక బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. లైవ్ వైర్ లాగా చాలా ఎనర్జిటిగ్గా ఉండే రామ్‌తో ఆయన సినిమా తీస్తుండటం అంచనాలను మరింత పెంచేదే. వీరి కలయికలో ప్రేక్షకులు ఆశించే లాగే మంచి మాస్ మసాలా సినిమా రాబోతోందని ఈ మధ్యే రిలీజైన టీజర్ చూస్తే అర్థమైంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరులో రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుంటున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుండటం.. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉండటంతో నెలా రెండు నెలలు ముందే రిలీజ్ చేయడానికి చూస్తున్నారట. ఆగస్టు లేదా సెప్టెంబరులోనే సినిమా విడుదల కావచ్చని సమాచారం.

క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కిన చిత్రాలు వాయిదా పడటం తప్ప అనుకున్న దాని కంటే ముందే రిలీజ్ కావడం అరుదు. ఐతే ఇందుకు షూటింగ్ వేగంగా అవుతుండటంతో పాటు వేరే కారణం కూడా ఉంది. నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం దసరాకే షెడ్యూల్ అయి ఉంది. బాలయ్యతో బోయపాటికి ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసిందే. పైగా వీళ్లిద్దరూ మరో సినిమా కోసం త్వరలో కలవబోతున్నారు.

అలాంటపుడు బాలయ్య, బోయపాటి బాక్సాఫీస్ దగ్గర తలపడితే బాగుండదు. పైగా దసరాకే రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ను కూడా షెడ్యూల్ చేశారు. ఆ పండక్కి మూడు క్రేజీ సినిమాల మధ్య పోటీ అంటే థియేటర్ల సర్దుబాటు కష్టమవుతుంది. వసూళ్లలో కూడా కోత పడుతుంది. అందుకే ఈ క్లాష్ లేకుండా సోలోగా ఆగస్టు నెలాఖర్లో లేదా సెప్టెంబరు మధ్యలో సినిమాను రిలీజ్ చేసుకోవాలని రామ్-బోయపాటి సినిమా టీం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.