ఎన్ని విమర్శలొచ్చినా.. కలెక్షన్లు తగ్గేదే లే


పోయినేడాది ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా విషయంలో ఎన్నెన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. అదొక ప్రాపగండా ఫిలిం అని.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు సపోర్ట్‌తో ముస్లింల మీద విషం చిమ్మేలా ఈ సినిమా తీసి జనాలను తప్పుదోవ పట్టించారని.. కశ్మీర్లో జరిగిన విషయాలను ఎగ్జాజరేట్ చేసి చూపించారని.. ఇలా రకరకాల విమర్శలు వినిపించాయి. కానీ ప్రేక్షకులు ఇవేవీ పట్టించుకోలేదు. ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా రూ.400 కోట్ల దాకా వసూళ్లు అందించారు.

ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమా కూడా ఇలాగే విమర్శలను దాటి బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజైనపుడే ప్రకంపనలు రేగాయి. కేరళలో లవ్ జిహాద్ పేరుతో ఇతర మతాల అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి.. వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం, వారిపై అకృత్యాలకు పాల్పడటం.. ఈ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్‌గా ఈ సినిమా తీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

రిలీజ్ తర్వాత కూడా ఇదొక ప్రాపగండా ఫిలిం అనే చర్చ తీవ్ర స్తాయిలోనే నడిచింది. కొన్ని రాష్ట్రాల్లో సినిమాపై నిషేధం పడింది. స్వయంగా మల్లీప్లెక్సులు ఈ చిత్ర ప్రదర్శనను ఆపేశాయి. కానీ అందుబాటులో ఉన్న చోట మాత్రం సినిమా అదిరే వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.10 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’.. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా దూసుకెళ్తోంది.

ఈ చిత్రం మూడో వీకెండ్లోనూ ఒక కొత్త సినిమాలా కలెక్షన్లు తెస్తోంది. ఈ శుక్రవారం ‘కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా రూ.6 కోట్లు రాబడితే.. మరుసటి రోజు వసూళ్లు రూ.9 కోట్లకు పెరిగాయి. ఆదివారం కూడా ఇదే రేంజిలో వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. శనివారం నాటికే ‘కేరళ స్టోరీ’ కలెక్షన్లు రూ.190 కోట్లకు చేరువగా ఉన్నాయి. సోమవారం రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం కూడా లాంఛనమే. కొత్త హిందీ సినిమాలతో పోలిస్తే ‘కేరళ స్టోరీ’నే ఎక్కువ కలెక్షన్లు తెస్తుండటం విశేషం.