మహేష్ ఫ్యాన్స్‌ను బోల్తా కొట్టించిన ‘పరశురామ్’

ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే తీశాడు యువ దర్శకుడు పరశురామ్. ఐతే అతడి చివరి సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి.. పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టడంతో అతడి రేంజ్ మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం సంపాదించాడు. ఈ సినిమా ఓ రేంజిలో ఉంటుందంటూ పరశురామ్ ఇంతకుముందు చేసిన ప్రకటన అభిమానుల్ని మురిపించింది.

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అంటూ సినిమా పేరు కూడా ప్రకటించారు. ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు చిత్ర బృందం ఏం విశేషం పంచుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ రోజు టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

స్వయంగా దర్శకుడు పరశురామే ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒక ట్విట్టర్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ పోస్టు కనిపిస్తున్న అకౌంట్ ఫేక్. పరశురామ్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి తరచుగా పోస్టులో పెడుతున్నారు.

మహేష్ సినిమా దర్శకుడు అని అతడి ఫ్యాన్స్ ఈ అకౌంట్‌ను ఫాలో అయిపోతున్నారు. అందులో వచ్చే అప్ డేట్లను నమ్మేస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు కోసం తమన్ సినిమా టైటిల్ ట్రాక్ రెడీ చేసేశాడని నమ్మేస్తున్నారు. కానీ ఆ రోజు ఏదో ఒక విశేషం పంచుకోవడం వాస్తవమే కానీ.. ఈ ట్వీట్ నమ్మి టైటిల్ ట్రాకే రిలీజ్ చేస్తారనుకుంటే పొరబాటే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.