సినిమాలను చంపేస్తున్న పాప్ కార్న్

ఒక మధ్య తరగతి కుటుంబం మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే కనీసం రెండు వేల రూపాయలు ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి ఉన్న మాట వాస్తవం. టికెట్ల ఖర్చు అయిదు వందలలోపే ఉంటే ఇంటర్వెల్ టైంలో తీసుకునే స్నాక్స్ బిల్లే తలకాయ వాచిపోయేలా ఉంటుంది. ఎవరు తినమన్నారని తేలిగ్గా అనేస్తాం కానీ భార్యా పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ కనీస సరదాలను అస్తమానం నియంత్రించలేం. పెద్ద బకెట్టు పాప్ కార్న్ ఆరు వందల పైమాటే ఉంది. రెండు బ్రెడ్డు ముక్కాల మధ్య స్టఫింగ్ చేసి ఇచ్చే సాండ్ విచ్ మూడు వందలు, బయట పాతిక రూపాయలు ఖరీదు చేసే కూల్ డ్రింక్ కనీసం వంద ఉంటోంది.

ఈ విషయం మీద దర్శకుడు తేజ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. రామబాణం ప్రమోషన్లలో భాగంగా గోపిచంద్ ని చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దాని సారాంశం ఏంటంటే మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ వల్ల సినిమా చచ్చిపోతోంది. బాలీవుడ్ గడ్డు కాలం ఎదురుకోవడానికి ప్రధాన కారణం ఇదే. రేట్లను తట్టుకోలేక బాధ పడటం కంటే అసలు వెళ్లడమే మానేస్తే బెటరనే అభిప్రాయం మిడిల్ క్లాస్ లో కలగడం వల్ల ఈ పరిణామం జరుగుతోంది. నార్త్ లోని ప్రధాన నగరాల్లోని సింగల్ స్క్రీన్లు పడగొట్టి మల్టీప్లెక్సులకు ఇవ్వడం వల్ల జరిగిన అనర్థం ఇది.

మన దగ్గర ఇంత తీవ్రంగా ఎందుకు లేదంటే ఒకటే తెర ఉన్న పెద్ద థియేటర్లు ఏపీ తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం వల్లే. ఒకవేళ ఇవీ తగ్గిపోతే ముందు ముందు పైన చెప్పిన గడ్డు స్థితి ఇక్కడా రావొచ్చు. తేజ అన్నదాంట్లో లాజిక్ లేకపోలేదు. టికెట్ రేట్ల మీద నియంత్రణ ఉన్న ప్రభుత్వాలు స్నాక్స్ పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఓటిటిలో వచ్చాక ఇంట్లోనే చూద్దామనే శాతం పెరిగిపోతోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ సమస్యని పరిష్కారం చేసే ఆశలు పెద్దగా లేవు కానీ అధికారం ఉన్న ఒక్కరైనా సీరియస్ గా ఆలోచిస్తే పనవుతుందేమో.