‘ఓటీటీ’ ఆంక్షలు ఏమయ్యాయబ్బా?

గత ఏడాది టాలీవుడ్లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. అలాగే ఓటీటీల ప్రభావం వల్ల సినీ పరిశ్రమ కుదేలవుతోందంటూ దిల్ రాజు సహా అగ్ర నిర్మాతలంతా కలిసి షూటింగ్స్ ఆపి.. నెల రోజుల పాటు చర్చోప చర్చలు జరిపి అనేక తీర్మానాలు జరిపారు. అందులో భాగంగా చిన్న సినిమాలకు కనీసం నెల రోజులు.. మిడ్ రేంజ్, పెద్ద సినిమాలు కనీసం 50 రోజుల తర్వాతే డిజిటల్‌గా రిలీజయ్యేలా చూడాలని.. దీన్ని అందరూ గట్టిగా పాటించి తీరాలని తీర్మానించారు.

అందులో భాగంగా మొదట్లో కొన్ని సినిమాలు ఈ విరామాన్ని పాటించాయి. పేరున్న సినిమాలు కొన్ని నెల రోజుల పాటు ఆగి తర్వాత ఓటీటీల్లోకి వచ్చాయి. కానీ ఈ ఆంక్షలు, స్వీయ నియంత్రణలు ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ రెండు మూడు వారాలకే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి రావడం మొదలైంది. మొదట్లో ఇదేంటి ఇలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. తర్వాత అందరూ అలవాటు పడిపోయారు.

ఈ నెల ఏడో తారీఖున రవితేజ సినిమా ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం మూడు వారాలు తిరక్కముందే, ఇదే నెలలో ఓటీటీలోకి దిగేసింది. ‘రావణాసుర’ ఫ్లాప్ మూవీనే కావచ్చు. కానీ అంత పెద్ద హీరో సినిమా మూడు వారాలకే ఓటీటీలో రిలీజైతే ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉంటుంది? సినిమా సరిగా ఆడలేదని ముందే ఓటీటీలోకి తెచ్చారని అనుకోలేం. ఈ డీల్ రిలీజ్‌కు ముందే ఫిక్సయి ఉంటుంది. అంటే సినిమా థియేటర్లలో బాగా ఆడి ఉన్నా మూడు వారాలకే ఓటీటీలో రిలీజయ్యేదన్నమాట.

గత నెలలో దిల్ రాజు సినిమా ‘బలగం’ ఇలాగే థియేటర్లలో మంచి వసూళ్లతో సాగుతుండగానే డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ విషయం తెలియక హీరో ప్రియదర్శి సైతం ఓటీటీ రిలీజ్ ఇప్పుడే లేదంటే లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు సోషల్ మీడియాలో. దిల్ రాజు, అభిషేక్ నామా లాంటి పేరున్న నిర్మాతలే తమకు తాము పెట్టుకున్న షరతులను మీరితే.. ఇక మిగతా ప్రొడ్యూసర్లు ఎందుకు ఆగుతారు?