మ్యాజిక్ మార్కు దాటేసిన ‘విరూపాక్ష’

టాలీవుడ్లో అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. గత శుక్రవారం విడుదలైన విరూపాక్ష సినిమా అలాగే మ్యాజిక్ చేసింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ హీరో సాయిధరమ్ తేజ్ ట్రాక్ రికార్డు బాలేకపోవడం, ప్రస్తుతం కొన్ని వారాలుగా బాక్సాఫీస్ స్లంప్‌లో ఉండటం, ఐపీఎల్ ప్రభావం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా నడిచాయి. కానీ తెరపై బొమ్మ పడ్డాక పరిస్థితి మారిపోయింది.

సినిమాకు మంచి టాక్ రావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లతో సాగింది. యుఎస్‌లో లిమిటెడ్ లొకేషన్లు, స్క్రీన్లలో రిలీజైనప్పటికీ పాజిటివ్ టాక్‌తో ‘విరూపాక్ష’ దూసుకెళ్లింది. శనివారానికల్లా హాఫ్ మిలియన్ మార్కు దాటేసింది. వీకెండ్ అయ్యేసరికి 7 లక్షల డాలర్ల మార్కును కూడా టచ్ చేసింది.

విశేషం ఏంటంటే.. వీకెండ్ తర్వాత కూడా ‘విరూపాక్ష’ జోరు తగ్గలేదు. సోమ, మంగళ, బుధ వారాల్లోనూ నిలకడగా వసూళ్లు వచ్చాయి. బుధవారం షోలన్నీ అయ్యేసరికి ‘విరూపాక్ష’ మిలియన్ డాలర్ మార్కును టచ్ చేసింది. వీకెండ్ తర్వాత ఏ సినిమా అయినా డౌన్ అవుతుంది. వసూళ్లు పడిపోతాయి. దీంతో ‘విరూపాక్ష’ మిలియన్ మార్కును అందుకోవడానికి రెండో వీకెండ్ వరకు ఆగాల్సి ఉంటుందని అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా వీక్ మధ్యలోనే సినిమా మ్యాజిక్ మార్కును అందుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్కును దాటేసింది. వరల్డ్ వైడ్ షేర్ రూ.30 కోట్లకు చేరువగా ఉంది. ఈ సినిమా ఆల్రెడీ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. సాయిధరమ్ తేజ్‌కు ఈ సినిమా పెద్ద బూస్ట్ అనడంలో సందేహం లేదు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌కు కూడా చాన్నాళ్ల తర్వాత మంచి విజయం దక్కింది. హీరోయిన్ సంయుక్త ఖాతాలో మరో పెద్ద హిట్ జమ కాగా.. యువ దర్శకుడు కార్తీక్ దండు కెరీర్‌కు కూడా ఈ చిత్రం బాగా ఉపయోగపడేదే.