తేజు ఆసుపత్రిలో.. దర్శకుడు కోమాలో!


కార్తీక్ దండు.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన పేరు. ‘విరూపాక్ష’ సినిమాతో అతను పెద్ద హిట్టే కొట్టాడు. చాలామంది కార్తీక్‌ను కొత్త దర్శకుడు అనుకుంటున్నారు కానీ.. అతను ఎనిమిదేళ్ల కిందటే నవీన్ చంద్ర, నవదీప్‌ల కాంబినేషన్లో ‘భమ్ భోలేనాథ్’ అనే సినిమా తీశాడు. అది ఆడకపోవడంతో తన గురించి చర్చే లేకపోయింది. ఆపై అతను సుకమార్ శిష్యరికంలో దాటులేలి.. ఆయన స్క్రిప్టు సహకారం అందించిన ‘విరూపాక్ష’తో దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.

తొలి సినిమా ఫ్లాప్ అయ్యాక దర్శకులకు ఇంకో అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. కార్తీక్ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ అవకాశం కాస్తా ప్రమాదంలో పడేసరికి తీవ్ర ఒత్తిడికి గురైన అనుభవాన్ని అతను మీడియాతో పంచుకున్నాడు. ‘విరూపాక్ష’ చిత్రాన్ని మరి కొన్ని రోజుల్లో మొదలు పెడదాం అనుకునే సమయానికే హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడట.

అప్పటి తన పరిస్థితి గురించి కార్తీక్ వివరిస్తూ.. “కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా మొదలు పెడదాం అనుకున్నాం. ఆ ఏర్పాట్లలో ఉండగా.. మా టీం అంతా కలిసి ఫోన్లు వైబ్రేషన్లలో పెట్టి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని సెకన్ల తేడాలో అన్ని ఫోన్లూ వైబ్రేట్ అయ్యాయి. మా ఆఫీస్ బాయ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. టీవీ పెడితే హీరోకి ప్రమాదం అని తెలిసింది. అది నాకు పెద్ద షాక్. 22 రోజుల పాటు తేజు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ 22 రోజులు హైదరాబాద్‌లో తిరుగుతున్నా కానీ.. కోమాలో ఉన్నట్లే అనిపించింది. తేజు సేఫ్‌గానే ఉన్నాడు, త్వరలోనే లేచి తిరుగుతాడని చెప్పాక ఊపిరి పీల్చుకున్నా. ఆ గ్యాప్‌లో మళ్లీ కథ మొత్తానికి స్టోరీ బోర్డ్ వేసుకుని మరింత పకడ్బందీగా సిద్ధమయ్యాం. తేజ్ సెట్లోకి వచ్చాక తొలి మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడినా.. స్పీచ్ తెరపీ, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మళ్లీ సెట్‌కు వచ్చాడు. తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది” అని తెలిపాడు.