వర్మ నిజాలు నమ్మేలా ఉంటాయా

క్లాసిక్ ఫిలిం మేకర్ గా ఒకప్పుడు ఎందరికో స్ఫూర్తినిచ్చి కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులను ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏనాడో తన స్థాయికి తగని అట్టడుగు కంటెంట్ తో సినిమాలు సిరీస్ లు తీస్తూ ప్రేక్షకుల్లో గౌరవాన్ని పోగొట్టుకున్న మాట వాస్తవం. సరే ఏదో డబ్బు వ్యామోహంలో పడి కొత్తగా వచ్చేది పోయేది ఏమీ లేదన్న నిర్లక్ష్యంతో ఇలా చేస్తున్నారనుకుని ఆడియన్స్ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అయితే రాజకీయ నేపథ్యం ఎంచుకుని ఎప్పుడైతే వైసిపి పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొత్త రంగులు బయటపడ్డాయి.

తాజాగా వర్మ నిజం అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వాస్తవాలను ఇందులో బయట పెడతారట. అవి ఏ కోణంలో ఎవరిని సమర్థిస్తాయో ఎవరిని టార్గెట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడకుండానే ఈ విషయం మీద నిర్ధారణకు రావొచ్చు. సందర్భం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను వెటకారంగా విమర్శించే వర్మ ఇప్పుడీ నిజం ద్వారా ఎన్ని అబద్దాలు ప్రచారంలోకి తీసుకొస్తారోనని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇదైతే నిజమే.

చాలా సున్నితమైన కేసు మీద వర్మ ఇలా యూట్యూబ్ వీడియోలు చేయడం తగని పనే అయినా వినే రకం కాదు కాబట్టి వీటి వెనుక ఉద్దేశం అర్థం కావాలంటే అవన్నీ చూశాక మరింత స్ఫష్టంగా క్లారిటీ వస్తుంది. ఎన్టీఆర్ లక్ష్మి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ పూర్తిగా వన్ సైడ్ పొలిటికల్ ఎజెండా సినిమాలు తీసిన వర్మ జగన్ ని కీర్తిస్తూ ఒక మూవీని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నాడు. వచ్చే ఎన్నికలకు కొన్ని నెలల ముందే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడీ సిరీస్ కి టైటిల్ ఎంత నిజమని పెట్టినా వర్మ గురించి తెలియనిది ఎవరికి.