విరూపాక్ష‌-2.. క‌న్ఫ‌మ్ చేసేశాడుగా


పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది విరూపాక్ష సినిమా. సాయిధ‌ర‌మ్ తేజ్, సంయుక్త జంట‌గా యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రం గ‌త శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫుల్ పాజిటివ్ రావ‌డం.. స‌మీక్ష‌లు బాగుండ‌టంతో తొలి రోజు సాయంత్రం నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగా సంద‌డి చేస్తోంది.

ఉద‌యంతో పోలిస్తే సాయంత్రానికి వ‌సూళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. వీకెండ్లో ఈ సినిమా రూ.20 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఔరా అనిపించింది. యుఎస్‌లో ఈ సినిమా మిలియ‌న్ డాల‌ర్ మార్కు దిశ‌గా దూసుకెళ్తోంది. ఏదైనా సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌డం ప్ర‌స్తుత ట్రెండు. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండి, క‌థ‌ను పొడిగించ‌డానికి అవ‌కాశం ఉన్న‌పుడు మేక‌ర్స్ కూడా ఆ దిశ‌గా చిన్న హింట్ ఇచ్చి వ‌దిలిపెడ‌తారు.

విరూపాక్ష సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. సినిమా సుఖాంతం అయి.. అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకున్నాక తేజు క‌ళ్లు చిత్రంగా మారుతాయి. అంత‌టితో ఎండ్ కార్డ్ ప‌డుతుంది. అంద‌రినీ ర‌క్షించిన హీరో త‌నే ద‌య్యం ప‌ట్టిన‌ట్లుగా క‌నిపించ‌డంతో క‌థ ఇంకా ముగియ‌లేదు, సెకండ్ పార్ట్ ఉంటుంద‌న్న భావ‌న క‌లుగుతుంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఒక నెటిజ‌న్ ట్విట్ట‌ర్లో సాయిధ‌ర‌మ్ తేజ్‌ను ట్యాగ్ చేస్తూ.. సీక్వెల్ ఉంటుందా అని ప్ర‌శ్నించాడు. దీనికి తేజు బ‌దులిస్తూ.. ఉంది కాబ‌ట్టే కదా హింట్ ఇచ్చాం అన్నాడు.

ఇంత పెద్ద హిట్ అయిన సినిమా, క‌థ‌ను పొడిగించ‌డానికీ స్కోప్ ఉంది.. అలాంట‌పుడు సీక్వెల్ తీయ‌కుండా వ‌దిలిపెట్టే ఛాన్సే లేదు. గ‌తంలో ఇదే జాన‌ర్లో తెర‌కెక్కిన‌ కార్తికేయ సినిమాను కూడా ఫ్రాంఛైజీగా మార్చిన సంగ‌తి తెలిసిందే. అందులో రెండో సినిమా ఇంకా పెద్ద హిట్ట‌యింది. మ‌రి విరూపాక్ష‌-2 ఎలాంటి సంచ‌ల‌నం రేపుతుందో చూడాలి.