జూబ్లీలో ఆవిష్కరించిన 1947 బాలీవుడ్

సినిమాలంటే పాత కథలనే కొంచెం అటుఇటు మార్చి స్టార్ హీరోలతో తీసి హిట్టు కొట్టొచ్చేమో కానీ వెబ్ సిరీస్ లో అలా కుదరదు. ఏదో ఒక నవ్యత ఉండాల్సిందే. లేదంటే ఒక్క ఎపిసోడ్ కే జనం షోని ఆపేస్తారు. ఈ విషయంలో ప్రైమ్ బాగా ఆరితేరిపోయింది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, పంచాయత్, బ్రీత్ సక్సెస్ కు కారణం ఇదే. తాజాగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించింది. అదే జూబ్లీ. ఒకప్పుడు బాలీవుడ్ ఎలా ఉండేదన్న పాయింట్ ని భారీ బడ్జెట్, రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో తెరకెక్కించారు. మొత్తం పది ఎపిసోడ్లతో ఫుల్ వెర్షన్ ని అందుబాటులోకి తెచ్చారు.

శ్రీకాంత్ రాయ్(ప్రసూన్ జీత్ ఛటర్జీ) ప్రముఖ స్టూడియో ఓనర్. మదన్ కుమార్ పేరుతో ఒక స్టార్ ని తయారుచేయాలన్నది అతని లక్ష్యం. దీని కోసం జంషెద్ ఖాన్(సందీప్ సింగ్)ను ఎంచుకుంటాడు. అయితే శ్రీకాంత్ భార్య సుమిత్ర(అదితిరావు హైదరి)అతనితో కలిసి లక్నో పారిపోతుంది. వాళ్ళను వెతకడం కోసం బినోద్ దాస్(అపర్ శక్తి ఖురానా)ని పంపిస్తాడు. కానీ ఇతను సుమిత్రతో వెనక్కు వస్తాడు. ఈ క్రమంలో జరిగే నాటకీయ పరిణామాల వల్ల రాయ్ కోరుకున్న స్టార్ గా బినోద్ అవతరిస్తాడు. సరిగ్గా అదే సమయంలో దేశ విభజన జరుగుతుంది. వీళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

దర్శకుడు విక్రమాదిత్య మొత్వానీ జూబ్లీని ఎప్పుడూ చూడని ఒక సరికొత్త పాత లోకంలో విహరింపజేసేలా తీయడం ఆకట్టుకుంటుంది. మొదటి అయిదు భాగాలు ఉన్నంత ఆసక్తికరంగా మిగిలినవి లేకపోయినప్పటికీ మొత్తంగా చూస్తే ఇటీవలే ఇదే ప్రైమ్ లో వచ్చిన ఫర్జీ కంటే చాలా నయమనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం బెస్ట్ అవుట్ ఫుట్ కి దోహదపడింది. పాత్రల మధ్య సంబంధాలు, ఆర్టిస్టుల పనితనం రెండూ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కమర్షియల్ జానర్ లో వినోదం ఆశిస్తే కష్టం కానీ పీరియాడిక్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు జూబ్లీ నచ్చే అవకాశాలే ఎక్కువ, నలుపు తెలుపు సినిమా ప్రపంచంలోని అసలు రంగులను చూపించారు.