అలీ తప్పుకున్నాడు వెన్నెల అందుకున్నాడు

ఒక టీవీ ప్రోగ్రాంకు బాగా పాపులారిటీ వచ్చిన తర్వాత హఠాత్తుగా అది ఆగిపోవాల్సి వస్తే ఆ లోటుని పూడ్చడం అంత సులభంగా ఉండదు. ఎస్పి బాలు పోయాక పాడుతా తీయగాకు మునుపటి కళను తీసుకురావడానికి చరణ్ తో సహా టీమ్ మొత్తం కష్టపడినా ఫలితం రావడం లేదు. నాగబాబు, రోజా, హైపర్ ఆదిలు వేర్వేరు కారణాలతో జబర్దస్త్ ని వదిలాక ఆ కామెడీ షోకి ఆదరణ తగ్గిన మాట వాస్తవం. ఇదే ఈటీవీలో ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ ఛానల్ లో అన్ని ఎపిసోడ్లకు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.

రాజకీయంతో పాటు వేరే రీజన్ల వల్ల ఆలీ గుడ్ బై చెప్పాక దాన్ని రీప్లేస్ చేయడం ఈటీవీ సవాల్ గా మారింది. బాగా ఆలోచించి తెలివిగా వెన్నెల కిషోర్ ని లైన్ లోకి పెట్టి అలా మొదలైంది పేరుతో సెలబ్రిటీ జంటల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు ఎలా అయ్యాయనే దాని మీద ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. దీనికి గాను సినిమాలతోనే విపరీతమైన బిజీగా ఉన్న వెన్నెల కిషోర్ కు భారీ పారితోషికం ఇచ్చారని టీవీ వర్గాల టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కాబట్టి ఖర్చు విషయంలో రాజీ ఉండదు. ఇంత చేసినందుకు దానికి తగ్గ ఫలితమే దక్కినట్టు కనిపిస్తోంది

ఇందులో భాగంగా హీరో నిఖిల్, దర్శకుడు వంశీ పైడిపల్లి, డాక్టర్ రాజశేఖర్, మంచు మనోజ్ దంపతులతో జరిపిన ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందట. యాంకర్ గా అవతారమెత్తిన వెన్నెల కిషోర్ కు స్పందన బాగుందని తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ వచ్చిన భాగాన్ని అత్యధిక శాతం చూశారని సమాచారం. పోటీ వాతావరణంలో ఇలా ఏదో ఒకటి వినూత్నంగా చేయకపోతే జనాలు టీవీ ఛానల్స్ చూడటం లేదు. ఓటిటిలు వచ్చాక కేవలం సినిమాల మీదే ఆధారపడితే శాటిలైట్ ఛానల్స్ కు వర్కౌట్ కావడం లేదు. అందుకే ఇలా క్రియేటివిటీకి పదును పెడుతున్నారు.