అలా మారిస్తే ‘రంగమార్తాండ’ ఆడేదా?

మంచి సినిమా అనిపించుకున్న ప్రతిదీ ఆడేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇందుకు ‘రంగమార్తాండ’ సినిమా ఉదాహరణ. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో అది ఒకటి. రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరున్న వ్యక్తి.. నిజ జీవితంలో నటించడం చేత కాక ఎలా ఓడిపోయాడో చూపించిన చిత్రమిది. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటిస్తే.. ప్రత్యేక పాత్ర చేసిన బ్రహ్మానందం అయితే జీవించేశాడు.

కథగా చూసుకుంటే రొటీన్ అనిపించినా.. కథనాన్ని చాలా హృద్యంగా నడిపిస్తూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు కృష్ణవంశీ. ఐతే ఆయన ఎంతో సిన్సియర్‌గా సినిమా తీసినా.. రిలీజ్ ముంగిట వేసిన ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. రిలీజ్ తర్వాత కూడా మంచి రివ్యూలు తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. అభిరుచి ఉన్న కొందరు ప్రేక్షకులు సినిమా చూశారు కానీ.. అది సరిపోలేదు. మొత్తంగా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా ఫ్లాపే అని చెప్పాలి.

కొత్త, పాత సినిమాల గురించి తన ‘పరుచూరి పలుకులు’ యూట్యూబ్ ఛానెల్లో అద్భుతంగా విశ్లేషించే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా ‘రంగమార్తాండ’ మీద టాపిక్ ఎంచుకున్నారు. ఈ సినిమా గురించి ఆయన చాలా సానుకూలంగా మాట్లాడారు. కన్నీళ్లు రావు అనుకున్న వారితోనూ కన్నీళ్లు పెట్టించిన సినిమా ఇదని పరుచూరి అన్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతమని.. బ్రహ్మానందం గుండెలు పిండేలా నటించగలడని ఈ సినిమాతో రుజువు చేశాడని.. ప్రకాష్ కూడా గొప్పగా నటించాడని ఆయనన్నారు.

ఐతే చాలా పాజిటివ్స్ ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని బలహీనతలున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఉంటే సినిమా ఇంకా బాగా ఆడేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. చివర్లో కళాభారతి ఎదుట.. తనను చూడ్డానికి వచ్చిన పిల్లల ముందే రాఘవరావు కన్నుమూసేలా చూపించారని.. అలా కాకుండా రాఘవరావు కళాభారతిని పునర్నిర్మించేలా పాజిటివ్‌గా సినిమాను ముగించి ఉంటే బాగుండేదని పరుచూరి అన్నారు. అలాగే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంల నట కౌశలాన్ని చూపించేలా వారి మధ్య నాటకాలతో ముడిపడ్ల మరి కొన్ని సన్నివేశాలు పెట్టి ఉంటే సినిమా మరింత ఎంగేజ్ చేసేదని పరుచూరి అభిప్రాయపడ్డారు.